- హోరాహోరీగా మూల వెంకటరవీందర్ రెడ్డి, కర్ర రాజశేఖర్ ప్యానళ్ల ప్రచారం
- ఇండిపెండెంట్లలోనూ బలమైన అభ్యర్థులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు కరీంనగర్ కాశ్మీర్ గడ్డలోని ఉమెన్డిగ్రీ కాలేజీతోపాటు, జగిత్యాల జిల్లా కేంద్రంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్బన్ బ్యాంకులో 9,287 మంది ఓటర్లు ఉండగా 7,272 మంది కరీంనగర్ లో, 2015 మంది జగిత్యాల జిల్లాలో ఉన్నారు.
వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని ఉమెన్డిగ్రీ కాలేజీలో 20 పోలింగ్ స్టేషన్లు, జగిత్యాలలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో 5 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఓటింగ్ అనంతరం మధ్యాహ్నం 3గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. గెలుపొందిన డైరెక్టర్ల పేర్లు ప్రకటించాక ఈ నెల 4లోపు పాలకమండలి ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కరీంనగర్ తోపాటు సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన సహకార శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు.
మూల(వెలిచాల), కర్ర ప్యానళ్ల మధ్య హోరాహోరీ
అక్టోబర్ 21 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, విత్ డ్రా ప్రక్రియ ముగిసేవరకు బరిలో 54 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 12 డైరెక్టర్ పోస్టులకుగానూ 12 మంది చొప్పున 36 మంది అభ్యర్థులు మూడు ప్యానెళ్లుగా విడిపోగా.. మిగతా వాళ్లు ఇండిపెండెంట్లుగానే తలపడుతున్నారు. 12 డైరెక్టర్ పోస్టుల్లో 9 జనరల్, రెండు మహిళలకు, ఒక పోస్టు ఎస్సీ/ఎస్టీకి రిజర్వ్ అయి ఉంది. గత 8 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడం, ఆఫీసర్లు, ఇన్చార్జి చైర్మన్ల పాలన కొనసాగడంతో ఈసారి ఎన్నికలను గతంలో డైరెక్టర్లుగా పనిచేసిన నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మద్దతుతో నిలిచిన మూల వెంకటరవీందర్ రెడ్డి ప్యానెల్ తోపాటు అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ రెడ్డి, మాజీ పర్సన్ ఇన్చార్జి గడ్డం విలాస్ రెడ్డి ప్యానెళ్లు పోటీపడుతున్నాయి. ప్రధానంగా మూల వెంకటరవీందర్ రెడ్డి, కర్ర రాజశేఖర్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
ఓటు వేసేటప్పుడు జాగ్రత్త..
జనరల్ కేటగిరీలో 9 స్థానాలకు 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఓటర్లు కేవలం వారికి నచ్చిన 9 మంది అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. 9 కంటే ఎక్కువ మందికి ఓటు వేసినట్లయితే ఆ ఓటు చెల్లదు.
మహిళా కేటగిరీలో 2 స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఓటర్లు కేవలం వారికి నచ్చిన ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలి. 2 కంటే ఎక్కువ వేసినట్లయితే ఆ ఓటు చెల్లదు.
ఎస్సీ / ఎస్టీ కేటగిరీలో 1 స్థానానికి 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓటరు కేవలం వారికి నచ్చిన ఒక అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలి. ఒకరి కంటే ఎక్కువ మందికి వేసినట్లయితే ఆ ఓటు
చెల్లుబాటు కాదు.
