
కర్ణాటక తుమకూరు జిల్లా జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటి గొడవ ఉహించని విధంగా మారింది. సల్మాన్ పాషా అనే ఓ వ్యక్తి తన భార్య, ఆమె బంధువులు తనను వేధించారని, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారని ఇంకా తన భార్య పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్యాయత్నం చేశాడు.
వివరాల్లోకి వెళ్తే కువైట్లో హైడ్రాలిక్ మెకానిక్గా పనిచేసిన సల్మాన్ పాషా కొంతకాలం కింద ఇండియాకు వచ్చాడు. అతడు నాలుగేళ్ల క్రితం సయ్యద్ నిఖత్ ఫిర్దోస్ను పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో రెండేళ్లు బాగానే ఉన్నా, సల్మాన్ ఉద్యోగం కోసం మళ్ళీ విదేశాలకు వెళ్లిన తర్వాత, నిఖత్ రెండో బిడ్డతో గర్భవతిగా ఉన్నప్పుడు వారి మధ్య గొడవలు మొదలయ్యాయి.
సల్మాన్ లైవ్ వీడియోలో మాట్లాడుతూ తన భార్య, ఆమె కుటుంబం, వారి బంధువు అయిన AIMIM తుమకూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బుర్హాన్ ఉద్దీన్ తనను మానసికంగా, ఆర్థికంగా వేధించారని ఆరోపించాడు. నిఖత్కు బుర్హాన్ ఉద్దీన్తో అక్రమ సంబంధం ఉందని, ఇండియాకు వచ్చాక తన ఇద్దరు పిల్లలను కూడా చూడనీయడం లేదని ఆరోపించాడు.
పోలీసులపై కూడా ఆరోపణలు: మహిళా పోలీస్ స్టేషన్ తన భార్యకి అనుకూలంగా వ్యవహరిస్తుందని, పోలీసులు కూడా తన భార్య కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నారని, గతంలో కూడా తనపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని సల్మాన్ అన్నారు. ఈ ఆరోపణల తర్వాతే అతడు ఆత్మహత్యకు ప్రయత్నించగా వెంటనే అతడిని తుమకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది. తమకు న్యాయమైన విచారణ కావాలంటూ సల్మాన్ కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ సంఘటనపై సల్మాన్ భార్య నిఖత్ ఫిర్దోస్ స్పందిస్తూ అతను చెప్పేవన్నీ అబద్ధాలు అని కొట్టిపారేసింది. గతంలో కూడా ఇలాగే చేశాడు, బెదిరించాడు కూడా. అతడి బెదిరింపుల గురించి నేను ఫిర్యాదు కూడా చేశాను. ఇప్పుడు మళ్లీ ఇలా నాటకం ఆడుతున్నాడు అని చెప్పింది. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.