
- ఫస్టియర్లో 71.15, సెకండ్ ఇయర్లో 77.68 శాతం పాస్
- గతేడాది కంటే మెరుగైన ఫలితాలు
- ఖమ్మం జిల్లాకు ఫస్టియర్ రిజల్ట్స్లో మూడో స్థానం, సెకండ్ ఇయర్లో ఐదో స్థానం
ఖమ్మం, వెలుగు: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో మరోసారి అమ్మాయిలే పైచేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా విద్యార్థులు ఈసారి మెరుగైన ఫలితాలే సాధించారు. ఫస్టియర్ లో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మూడో స్థానంలో ఉండగా, సెకండ్ ఇయర్లో ఐదో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చినా ఈసారి మంచి ఫలితాలే వచ్చాయి. మొదటి సంవత్సరంలో 15,584 మంది పరీక్ష రాయగా, 11,088 మంది పాస్ అయ్యారు. సెకండ్ఇయర్లో 14,876 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయగా, 11,557 మంది పాసయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో 71.15 శాతం మంది పాస్ కాగా, సెకండ్ఇయర్లో 77.68 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఒకేషనల్ ఫస్టియర్లో 2,253 మంది పరీక్ష రాయగా, 1,388 మంది పాస్ అయ్యారు. సెకండియర్లో 2,043 మంది పరీక్ష రాయగా, 1439 మంది పాస్ అయ్యారు.
భద్రాద్రికొత్తగూడెంలో..
భద్రాద్రికొత్తగూడెం: ఇంటర్ఫలితాల్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్కాలేజీలు ఫలితాల్లో ప్రభంజనం సృష్టించాయి. ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. జిల్లాలోని నలంద, కృష్ణవేణి, సాహితి కాలేజీలకు చెందిన స్టూడెంట్స్ రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. సెకండ్ ఇయర్లో 8,866 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయగా 6,422 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,759 మంది బాయ్స్కు 2,350 మంది, 5,107 మంది బాలికలకు 4,072 మంది పాస్ అయ్యారు. 62.51శాతంతో బాలురు ఉత్తీర్ణత సాధించగా, 79.73శాతంతో బాలికలు పైచేయిగా నిలిచారు.
ఫస్ట్ ఇయర్ లో 9,254 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయగా, 5,779 మంది పాస్ అయ్యారు. 3,888మంది బాలురకు 1,972 మంది పాస్ అయ్యారు. 5,366 మంది బాలికలకు 3,807 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్లో 70.94 శాతంతో బాలికలు సత్తా చాటారు. పాల్వంచ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న లిక్కి కోటేశ్వరరావు కొడుకు లిక్కి విశ్రుత్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో 994 మార్కులు సాధించి స్టేట్లో ఫస్ట్ ర్యాంకులో నిలిచాడు. అతడిని ఎస్పీ రోహిత్ రాజును అభినందించారు. పాల్వంచకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తోర్తి నవ్యశ్రీ ఎంపీసీలో 468 మార్కులు సాధించి సత్తా చాటింది. ములకలపల్లి మండలం కేజీబీవీ స్టూడెంట్ పి.సౌమ్య 986 మార్కులు సాధించారు.