హైదరాబాద్, వెలుగు: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఎఫ్టీసీసీఐ), రాష్ట్రం ప్రభుత్వంతో కలసి నిర్వహిస్తున్న ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో – 2023ను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. మాదాపూర్లోని హైటెక్స్లో దీనిని ఉదయం 11 నుండి 6.30 గంటల వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ప్రవేశం ఉచితం. 14 మంది సభ్యులతో కూడిన వియత్నాం బిజినెస్ డెలిగేషన్ ఎక్స్పోను సందర్శించింది. ఈ సందర్భంగా100 కంటే ఎక్కువ బీ2బీ సమావేశాలు జరుగుతాయని ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ తెలిపారు.
ఈ ఎక్స్పోలో ఎంఎస్ఎంఈలకు చెందిన120 స్టాల్స్ ఉన్నాయని, ఐసీఐసీఐ, ఫోర్ సోలార్, క్వాంటమ్ ఎనర్జీ, స్టాండర్డ్ కిచెన్స్, టీఎస్ఐఐసీ, టీఎస్ఆర్ఈడీసీఓ, ఐఐఎంఆర్, ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ, ఇక్రిశాట్, బీఎన్ఐ, టీ–హబ్, టీ–వర్క్స్, టీఎస్టీపీసీ వంటి ప్రభుత్వ , ప్రైవేటు సంస్థలు ఈ ఎగ్జిబిషన్ కు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. బెల్జియం, మారిషస్, రస్ అల్ ఖైమా వంటి కొన్ని దేశాల ప్రతినిధుల బృందాలు కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో తొమ్మిది ఏళ్లలో 90 ఏళ్ల అభివృద్ధి సాధించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, విధానాలు, సుపరిపాలన వల్లే ఇది సాధ్యమైందన్నారు. కరెంటు కోతలు గత చరిత్రగా మారాయని అన్నారు.