
తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు చేపట్టింది. ఈఎన్సీ జనరల్ మురళీధర్రావు రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఆయన పదవీకాలం ముగిసినా ఈఎన్సీగా కొనసాగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవంటూ గతేడాది నవంబర్ లో వ్యాఖ్యనించారు. ఆలాగే రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. రేపటినుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఆ శాఖలో చాలా ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తోన్న ఇంజినీర్లపై వేటు వేసింది.