హైదరాబాద్​ను జీవితంలో మరువ : మిస్​ వరల్డ్ సుచాత

హైదరాబాద్​ను జీవితంలో మరువ : మిస్​ వరల్డ్ సుచాత
  • అవకాశం వస్తే మళ్లీ ఇక్కడికి వస్తా: మిస్​ వరల్డ్ సుచాత
  • ఇక్కడి సంస్కృతీ, సంప్రదాయాలు ఆకట్టుకున్నయ్​
  • తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు 

హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్​ను తాను జీవితంలో మరిచిపోనని మిస్​వరల్డ్​–2025 విజేత ఓపల్​ సుచాత తెలిపారు. అవకాశం వస్తే మళ్లీ ఇక్కడికి వస్తానని చెప్పారు. హైదరాబాద్ లోని హోటల్​ట్రైడెంట్​లో ఆదివారం ఆమె మాట్లాడారు. ‘‘హైదరాబాద్ ఎంతో అందమైన నగరం. ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారు.

ఈ అనుభవం నా జీవితంలో మరపురాని మధుర జ్ఞాపకం” అని పేర్కొన్నారు. థాయిలాండ్‌‌కు ఇది మొట్టమొదటి మిస్ వరల్డ్  క్రోన్ అని, ఇది గెలుచుకోవడం తనకు గర్వకారణం మాత్రమే కాక, ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. తన దేశ ప్రజలతోపాటు హైదరాబాద్​లో తనకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని చెప్పారు. మిస్​ వరల్డ్​విజేతగా తనను ప్రకటించిన క్షణం ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలిపారు.  లక్ష్యం ఏర్పాటు చేసుకొని కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పారు. ఇది తన గెలుపు మాత్రమే కాదని, ప్రతి కంటెస్టెంట్, వారి పర్పస్ గెలుపు అని అన్నారు. 

సేవా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తా 

తాను గత మూడేండ్లుగా థాయిలాండ్​లో  బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కల్పిస్తున్నాని ఓపల్​ సుచాతా తెలిపారు. ఇందుకోసం ఫండ్ రైజింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇకపై తన పర్పస్ ప్రాజెక్ట్ తోపాటు  ఇతర కంటెస్టెంట్స్‌‌ పర్పస్ ప్రాజెక్ట్స్  పై  మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తానని చెప్పారు. మహిళా సాధికారత,  సమస్యలపై పనిచేస్తానని తెలిపారు. తన సేవా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తానని చెప్పారు. 

సంస్కృతీ, సంప్రదాయాలకు తెలంగాణ ప్రతిరూపం

తెలంగాణ ప్రజల ఆతిథ్యం మరువలేనిదని,  వారు చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మదిలో నిలిచిపోతాయని ఓపల్​ సుచాతా తెలిపారు.  సంస్కృతీ, సంప్రదాయాలకు తెలంగాణ ప్రతిరూపం అని పేర్కొన్నారు. ఇక్కడి కళలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. రామప్ప, చార్మినార్  నిర్మాణం విస్తుపోయేలా చేసిందని, ఇది  కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. అలాగే, రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో బాగుందని, బాహుబలి సెట్ నచ్చిందని చెప్పారు. 

ఇక్కడ మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘షీ టీమ్స్’ గొప్ప ఆవిష్కరణ అని, మహిళలు విద్య, వైద్య, ఐటీ,  మొదలైన రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయం అని పేర్కొన్నారు.  ఎయిర్‌‌పోర్ట్‌‌లో దిగిన క్షణం నుంచే రాష్ట్ర ప్రభుత్వం అందించిన హాస్పిటాలిటీ అద్భుతంగా ఉందని తెలిపారు. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎంతో శ్రమించారని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఈవెంట్‌‌ను  నిర్వహించిన తీరు, తమకు అందించిన సహకారం చిరస్మరణీయమన్నారు. మిస్​వరల్డ్​, థాయిలాండ్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.