పిల్లలు తమ అడుగుజాడల్లో నడిస్తే ఎంతో మురిసిపోతారు తల్లిదండ్రులు. ఈ పైలట్ అయిన తల్లి కూడా ఇప్పుడు అంతే సంతోషంగా ఉంది. కొడుకు అమర్ ఠాకూర్ పైలట్ అవ్వడమే కాకుండా మొదటిసారిగా తను నడుపుతున్న ఫ్లయిట్లో ఆమెను ప్యాసింజర్గా తీసుకెళ్లాడు. మదర్స్ డే రోజున ఇండిగో ఫ్లయిట్లో కనిపించిందీ దృశ్యం. ఈ తల్లీకొడుకుల వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. పైలట్ అయిన తల్లిని చూసి, తను కూడా పైలట్ అవ్వాలి అనుకున్నాడు అమర్. అనుకున్నట్టుగానే ఇప్పుడు కో–పైలట్ అయ్యాడు. మదర్స్ డే రోజు తన విమానంలో కనిపించిన తల్లికి పూల బొకే ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.
ఈ రోజు నాకు చాలా స్పెషల్
అంతేకాదు మైక్రోఫోన్ అందుకుని ‘‘గుడ్ ఈవెనింగ్ లేడిస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్. నేను పైలట్ అమర్ ఠాకూర్. మీకో విషయం చెప్పాలి. ఈరోజు మదర్స్ డే. మీరందరూ మీ తల్లులకు విషెస్ చెప్పే ఉంటారు. నేను కూడా మా అమ్మకు నా ప్రేమను తెలియజేయాలి అనుకుంటున్నా. 25 ఏండ్లుగా మా అమ్మ ఫ్లయిట్ నడుపుతుంటే నేను ప్యాసింజర్గా ఉన్నాను.
కానీ, ఈ రోజు కో–పైలట్గా నేను నడుపుతున్న ఫ్లయిట్లో మా అమ్మ ప్రయాణిస్తోంది. నాకోసం అన్ని చేసినందుకు, అన్నివేళలా అండగా నిలిచినందుకు థ్యాంక్యూ సో మచ్ అమ్మా’’ అంటూ ఈ రోజు తనకెంత స్పెషల్ అనేది చెప్పాడు అమర్. ఇండిగో ఎయిర్లైన్ వీళ్ల వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఈ వీడియోను ఇప్పటికే 70 లక్షల మంది చూశారు.