షాంఘైలో జనాలను బస్సుల్లో బలవంతంగా తరలిస్తున్న చైనా
షాంఘై: చైనాను కరోనా షేక్ చేస్తోంది. షాంఘై సిటీలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వైరస్ తాకిడికంటే అధికారుల కఠిన ఆంక్షలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా వారాలుగా షాంఘై వాసులు ఇండ్లకే పరిమితమైపోయారు. కరోనా పాజిటివ్ వచ్చిన వందలాది మందికి ఇంట్లో క్వారంటైన్అమలు చేస్తున్నారు. నెగెటివ్ వచ్చిన వాళ్లను ఏకంగా వందల కిలోమీటర్ల దూరం తరలిస్తున్నారు. ‘‘అర్ధరాత్రి నన్ను, మా చుట్టుపక్కల వాళ్లను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించి క్వారంటైన్ సెంటర్ కు తీసుకెళ్లారు. మా కాంపౌండ్లో చాలా పాజిటివ్ కేసులు వచ్చాయని పోలీసులు చెప్పారు. అందువల్ల మేము కూడా ఇక్కడే ఉంటే వైరస్ బారినపడతామనే క్యాంపులకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. మాకు వేరే చాయిస్ లేదు. మళ్లీ మేము ఎప్పుడు తిరిగి ఇంటికి వెళతామనేది తెలియడంలేదు”అని షాంఘైకి చెందిన లూసీ అనే మహిళ చెప్పారు. షాంఘైకి సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని అన్హుయి ప్రావిన్స్లో ఏర్పాటు చేసిన ప్రీప్యాబ్ క్యాబిన్లలో వీరిని ఉంచుతున్నారు. అయితే తమను ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయం వారికి చెప్పలేదు. అక్కడికి వెళ్లాక సింగిల్ రూమ్స్లో ఒక్కొక్కరినీ ఉంచుతున్నారు.