న్యూఢిల్లీ: దేశంలో హౌస్హోల్డ్స్(కుటుంబాల) సేవింగ్స్ తగ్గుతున్నాయి. కిందటేడాది కరోనా సంక్షోభంతో ఖర్చులు తగ్గించుకొని, సేవింగ్స్ను హౌస్హోల్డ్స్ పెంచుకున్నాయి. ప్రస్తుతం చూస్తే హౌస్హోల్డ్స్ సేవింగ్స్ కరోనా ముందుస్థాయికి చేరుకుంటున్నాయి. క్వార్టర్ ప్రాతిపదికన చూసుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో కుటుంబాల ఖర్చులు పెరిగి, సేవింగ్స్ తగ్గాయని ఆర్బీఐ ఓ రిపోర్ట్లో పేర్కొంది. హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ రేటు క్వార్టర్ ప్రాతిపదికన 2020–21 రెండో క్వార్టర్(క్యూ2) జీడీపీలో 10.4 శాతానికి తగ్గింది. ఇది ముందటి క్వార్టర్లో 21.0 శాతంగా ఉంది. కాగా, 2020–21 రెండో క్వార్టర్లో దేశంలో హౌస్హోల్డ్స్ సేవింగ్స్ రేటు, 2019–-20 రెండో క్వార్టర్లో నమోదైన రేటు కంటే 9.8 శాతం ఎక్కువ కావడం గమనార్హం. హౌస్హోల్డ్ సేవింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో కూడా తగ్గుతాయని ఆర్బీఐ రిపోర్ట్ అంచనావేసింది. ఎకనామిక్ యాక్టివిటీ పుంజుకోవడంతో ప్రజల వినియోగం పెరుగుతోందని తెలిపింది.
వ్యాక్సినేషన్ ప్రాసెస్తో ఎకానమీ ముందుకు
మ్యూచువల్ ఫండ్స్ వంటి సేవింగ్స్ స్కీమ్లో హౌస్హోల్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయి. మరోవైపు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి కొత్త అప్పులు దొరుకుతుండడంతో హౌస్హోల్డ్స్ ఖర్చులు పెరుగుతున్నాయని ఆర్బీఐ రిపోర్ట్ అంచనావేసింది. కాగా, కరోనా సంక్షోభ టైమ్లో లోన్లను ఇవ్వడానికి ఫైనాన్షియల్ సంస్థలు వెనకడుగేసిన విషయం తెలిసిందే. ఎకానమీ తిరిగి రికవరీ అవుతుండడంతో ఫైనాన్షియల్ సంస్థలు అప్పులివ్వడం మళ్లీ పెరిగింది. హౌస్ హోల్డ్స్ కూడా ఇంతకు ముందు కేవలం ఎసెన్షియల్ (అత్యవసరమైన) వస్తువులను మాత్రమే కొనేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇతర వస్తువులనూ కొనడానికి ముందుకొస్తున్నారు. దీంతో వారి సేవింగ్స్ కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటున్నాయి.‘ కరోనా దెబ్బతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్(క్యూ1) లో ప్రజల సేవింగ్స్ గరిష్టాలకు చేరుకున్నాయి. తర్వాతి క్వార్టర్లో ఇది తగ్గింది. మరోవైపు ప్రజలు తీసుకుంటున్న అప్పులు పెరుగుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో సేవింగ్స్, ఫిజికల్గా డబ్బులను మెయింటైన్ చేయడం వంటివి తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా ప్రజలు తమ ఖర్చులను పెంచుతున్నారు. అన్లాక్ తర్వాత ఎకానమీ యాక్టివిటీ పుంజుకుందనే విషయం దీంతో అర్థమవుతోంది’ అని ఆర్బీఐ రిపోర్ట్ పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రాసెస్ కూడా స్టార్టవ్వడంతో భవిష్యత్లో ప్రజల సేవింగ్స్, ఖర్చుల విషయంలో మార్పులుంటాయని, ఇవి కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటాయని తెలిపింది.
షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెరగొచ్చు..
లాక్డౌన్ నుంచి ఎకానమీ తిరిగి ఓపెన్ కావడంతో హౌస్ హోల్డ్స్ కొనుగోళ్లు పెరిగాయి. 2020–21 క్యూ1 లో ప్రజల వినియోగం 26.3 శాతం తగ్గింది. ఆ తర్వాత క్వార్టర్ క్యూ2 నాటికి కన్జంప్షన్ దాదాపు రెట్టింపయింది. క్యూ1 లో మునుపెన్నడూ లేనంతగా హౌస్హోల్డ్ సేవింగ్స్ రేటు ఉంది. ప్రజల వినియోగం మెరుగుపడుతోందని కిందటేడాది నవంబర్లో రిజర్వ్ బ్యాంక్ కన్జూమర్ కాన్ఫిడెన్స్ సర్వే పేర్కొంది. సెప్టెంబర్, 2020 లో ఆల్టైమ్ రికార్డ్ కనిష్టాల నుంచి వినియోగం పెరిగిందని తెలిపింది. భవిష్యత్తో కూడా హౌస్హోల్డ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ తగ్గుతాయని ఈ సర్వే అంచనావేసింది. కిందటేడాది డిసెంబర్ క్వార్టర్ ముగిసే నాటికి కమర్షియల్ బ్యాంక్లిచ్చిన అడ్వాన్స్లు(లోన్లు, ఓవర్ డ్రాఫ్ట్లు వంటివి) ముందటి క్వార్టర్తో పోలిస్తే 2.7 శాతం పెరిగాయి. ఈ గ్రోత్ సెప్టెంబర్ క్వార్టర్లో 0.2 శాతంగానే ఉంది. ఇదే టైమ్లో ఈ బ్యాంకుల డిపాజిట్లు 2.9 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గాయి. బ్యాంకులు ఇస్తున్న పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ పెరుగుతున్నాయని ఆర్బీఐ సర్వే పేర్కొంది. 2020–21 క్యూ2 లో క్రెడిట్ గ్రోత్ 1.3 శాతంగా నమోదయ్యింది. ఇది క్యూ1 లో 0.4 శాతంగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3 లో హౌస్హోల్డ్ సేవింగ్స్ మరింత తగ్గుతాయనే విషయం దీనినిబట్టి అర్ధమవుతోందని ఆర్బీఐ సర్వే పేర్కొంది. స్టాక్ మార్కెట్లు పెరుగుతుండడంతో తమ సేవింగ్స్లో కొంత భాగాన్ని మళ్లీ షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్స్లో ప్రజలు పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయని కూడా ఈ రిపోర్టు అంచనా వేసింది.