
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసిన స్కెచ్లు, ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి. వీటిని రాధాకిషన్రావు కస్టడీ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు.
‘ఆపరేషన్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్’ కోసం నాటి టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ శ్రీనాథ్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని ఢిల్లీకి పంపించారు. హై క్వాలిటీ స్పై కెమెరాలు కొనుగోలు చేయించారు. వీటిని రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో ఫిక్స్ చేశారు. ఫామ్హౌస్పై టాస్క్ఫోర్స్ ఎస్ఐలు అశోక్రెడ్డి, మల్లికార్జున్, శ్రీకాంత్ మరికొంత మంది పోలీసులు నిఘాపెట్టారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఫామ్హౌస్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
2022 అక్టోబర్ 26న కొల్లాపూర్, అచ్చంపేట, తాండూరు, పినపాక నియోజకవర్గాల నాటి ఎమ్మెల్యేలు(బీఆర్ఎస్) హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావును ఫామ్హౌస్లో ఉంచారు. స్పై కెమెరాలు సీసీటీవీ కెమెరాలకు స్పష్టంగా కనిపించే విధంగా సీటింగ్ అరెంజ్ చేశారు. రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్ అక్కడికి రాగానే పోలీసులతో రెయిడ్స్ చేయించారు.
రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్ను అరెస్ట్ చేసి.. ఫామ్హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రిజిస్టర్ చేశారు. కొనుగోలు వ్యవహారం వెనుక బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ ఉన్నట్లు ప్రచారం చేశారు.