
- పోలీస్ వెహికల్స్, యూనిఫామ్స్ వాడకంపై విమర్శలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైదరాబాద్, వెలుగు: దేశంలోని140 పోలీస్ స్టేషన్లతో పోటీపడి బెస్ట్ ఆఫ్ త్రీగా నిలిచిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఎస్ఐల ప్రీ వెడ్డింగ్ షూట్ వివాదానికి దారి తీసింది. పీఎస్లో ఉన్న మూడు సింహాల చిహ్నం, పోలీస్ వెహికల్స్, యూనిఫామ్, పీఎస్ పరిసర ప్రాంతాలను ప్రీ వెడ్డింగ్ షూట్కు వాడుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. పంజాగుట్ట స్టేషన్లో ఓ మహిళా ఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ రెండు నెలల క్రితం చేసిన ఈ షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Raed:పూర్తిగాని ప్రాజెక్టును ప్రారంభించుడేంది?... సీఎం కేసీఆర్పై షర్మిల ఫైర్
2020 బ్యాచ్కు చెందిన భావన పంజాగుట్ట పీఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నది. భావన, అదే బ్యాచ్కు చెందిన ఏఆర్ఎస్ఐ రావూరి కిశోర్ ప్రేమించుకున్నారు.పెద్దల అంగీకారంతో ఆగస్ట్ 26న వివాహం చేసుకున్నారు. అయితే అంతకుముందే వీరిద్దరూ పీఎస్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. పోలీస్ వెహికల్స్, యూనిఫామ్స్ ను తమ షూట్లో వాడుకున్నారు. భావన పోలీస్ వెహికల్ దిగుతూ అక్కడున్న ఓ బాధితునితో మాట్లాడుతున్నట్లు షూట్ చేశారు.
కిశోర్ మరో వెహికల్లో వచ్చి ఆమెను చూస్తూ పీఎస్లోకి వెళ్తున్నట్లు రికార్డ్ చేశారు. ఆ తర్వాత బయటి ప్రదేశాల్లో వీరు డ్యూయెట్ పాడుకున్నట్లు చిత్రీకరించారు. యూట్యూబ్లో అప్ లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇద్దరు ఎస్ఐలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. స్టేషన్లో ఇలాంటి ప్రైవేట్ షూటింగ్స్ జరుగుతుంటే ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న పీఎస్ను షూటింగ్ స్పాట్గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.