జల్సాల కోసం రైళ్లలో చైన్ స్నాచింగ్

జల్సాల కోసం రైళ్లలో చైన్ స్నాచింగ్
  • ప్రైవేట్​ ఎంప్లాయి అరెస్ట్
  • 77 గ్రాముల గోల్డ్​సీజ్

పద్మారావునగర్, వెలుగు: జల్సాలకు అలవాటు పడి, చైన్ స్నాచింగ్స్​చేస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడకు చెందిన కోరుప్రోలు లవరాజు (23) రెండేండ్లుగా జీడిమెట్లలోని హెటిరో ల్యాబ్స్​లో జూనియర్ కెమిస్ట్​గా పనిచేస్తున్నాడు. మద్యం, ఆన్​లైన్ బెట్టింగ్​కు బానిసై, జీతం డబ్బులు సరిపోక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికుల నుంచి చైన్‌ స్నాచింగ్​చేస్తున్నాడు. ఇటీవల సింహపురి, గౌతమి ఎక్స్​ప్రెస్‌ రైళ్లలో చైన్‌ దొంగతనాలు చేశాడు. 

సోమవారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, గతంలో పలు చైన్​స్నాచింగ్స్​చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, రూ.7.7 లక్షల విలువైన 77  గోల్డ్​ ఆర్నమెంట్స్​స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు చైన్లు దొంగిలించి, రెండింటిని అమ్మిన నిందితుడు.. ఒకదానిని తాకట్టు పెట్టినట్లు తెలిపాడు.