పేద పిల్లలు చదివే  ప్రైవేట్ బడి

పేద పిల్లలు చదివే  ప్రైవేట్ బడి

సోహెల్​... హైదరాబాద్​ కార్వాన్​లో ఉంటాడు. పదో క్లాస్​ పూర్తయ్యింది. తరువాతి చదువులు చదివేందుకు డబ్బు ఇబ్బందులు అడ్డుపడ్డాయి. అలాగని అతని చదువుకు ఫుల్​స్టాప్​ పడలేదు. తను అంతవరకు చదివిన ‘గ్రేస్​ మోడల్​ స్కూల్​’ ఒకదారి చూపింది. దాంతో యునైటెడ్​ వరల్డ్​ కాలేజీ ( యూడబ్ల్యూసీ) స్కాలర్​షిప్​ 42 లక్షల రూపాయలు వచ్చింది. సోహెల్​ చదువుకోవాలన్న కోరిక అలా తీరింది. 

సోహెల్ ది చాలా పేద కుటుంబం. ఐదుగురు అన్నదమ్ములు. ఇద్దరు అక్కలు. తండ్రి ఆటో డ్రైవర్​గా పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ మూడేండ్ల క్రితం ఆయన చనిపోయాడు. సోహెల్​కు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం. నర్సరీ నుంచి ‘గ్రేస్​ స్కూల్’​లోనే చదివాడు. తండ్రి చనిపోయిన తర్వాత చదువుకోవడానికి ఇబ్బందులు వచ్చాయి. అలాగని, సోహెల్​ చదువు ఆగిపోలేదు. బాధ్యతలన్నీ  స్కూల్​ యాజమాన్యం తీసుకుంది. ‘నన్ను చదివించింది పూర్తిగా స్కూల్​ వాళ్లే. ఎస్సెస్సీ తర్వాత ఫ్యాకల్టీ సపోర్ట్​తో స్కాలర్​షిప్​కు అప్లయ్​ చేశాను. ఇంటర్వ్యూ ఫేస్​ ​ చేశాను. ఆగస్ట్​ పదిహేనో  తారీఖున  కన్ఫర్మేషన్​ వచ్చింది.  ​యూడబ్ల్యూసీ కాలేజీలు ప్రపంచవ్యాప్తంగా 18 ఉన్నాయి. నాకు జర్మనీలో  సీట్​ వచ్చింది. కానీ కొవిడ్​ వల్ల ఆ కాలేజీ వాళ్లు ఇండియన్​ స్టూడెంట్స్​ను అనుమతించలేదు.  సీట్​ను ఇండియాలోని కాలేజ్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. అలా నాకు పూనేలో సీట్​ దొరికింది.  మా అమ్మా వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. రెండు సంవత్సరాలు పూనేలో చదువుకోబోతున్నాను. నాకు హ్యాపీగా ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నేను పై చదువులకు వెళ్లడం చాలా బాగనిపిస్తోంది. ’ అన్నాడు సోహెల్.  సోహెల్​ చదివిన స్కూల్​ కార్వాన్​లోని గ్రేస్​ మోడల్​ స్కూల్​.  పేదపిల్లల కోసమే  నడుపుతున్న  ప్రైవేట్​ స్కూల్​ ఇది.  ఆయేషా సిద్దిఖీ– మిర్జా ఇర్ఫాన్​ దంపతులు కట్టిన పేదవాళ్ల ప్రైవేట్​ బడి.  ఇటీవల ఆ స్కూల్​ స్టూడెంట్స్​ జాతీయ స్థాయి స్కాలర్​షిప్​, ఫెలోషిప్​లకు సెలక్ట్​ అయ్యారు. ఈ స్కూల్​ పెట్టాలనే ఆలోచన సౌదీ నుంచి హైదరాబాద్​కు వచ్చిన ఇర్ఫాన్​కు వచ్చింది.  ఆ ఆలోచన రావడానికి కారణం కార్వాన్​లోని సబ్జీమండి ప్రాంతం.  ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఆ మార్కెట్​లో  ఏదో ఒకటి అమ్ముతూ లేదా  కొంటూ ఉంటారు. పెళ్లి​  సెలవుల కోసం సౌది నుంచి  కార్వాన్​ వచ్చిన ఇర్ఫాన్​ ఇవ్వన్నీ చూసి ఆలోచనలో పడ్డాడు. బడికి వెళ్లాల్సిన పిల్లలు ఇలా మార్కెట్​లో పని చేయడం, పాన్​ షాప్​ల దగ్గర, కిరాణా షాపుల్లో చైల్డ్​ లేబర్లుగా పని చేయడం ఏంటనుకున్నాడు. వాళ్ల  వివరాలు కనుక్కోవడం మొదలు పెట్టాడు. ‘వాళ్లు చదువుకోరు. ఇలానే పని చేస్తుంటారు’ అని తెలిసింది. వెంటనే వాళ్లకు చదువులు చెప్పించాలనుకున్నాడు. ఆయేషాతో 2002లో పెళ్లయ్యాక సౌదీకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. స్కూల్​ పెట్టాలని కార్వాన్​లోనే ఉండిపోయాడు. 
 సర్కార్​ బడులు సక్కగ లేకనే
 సబ్జీమండిలో ఎక్కువశాతం ఉండే ముస్లిం కమ్యూనిటీ పిల్లల్ని బడికి పంపాలంటే.. ప్రైవేట్ స్కూల్​​ ఫీజులు  భరించలేరు. సర్కార్​ బడుల్లో సౌలత్​లు ఉండవని అక్కడికి పంపడమే మానేశారు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం ఒక్కటే..  అదే ‘ప్రైవేట్​ బడి. తక్కువ ఫీజుతో పేద పిల్లల కోసం నడిచే ప్రైవేట్​ బడిని పెట్టాలి అనుకున్నారు. 2002లో ఉండి గ్రేస్​ మోడల్​ స్కూల్​ మొదలు పెట్టారు.  కరస్పాండెంట్​గా ఇర్ఫాన్​, ప్రిన్సిపాల్​గా ఆయేషా.
ఫీజు యాభై రూపాయలు
సబ్జీ మండిలో కమ్యూనిటీ పిల్లల కోసం గ్రేస్​ మోడల్ స్కూల్​ ప్రారంభమైన మొదటి ఏడాది వంద మంది పిల్లల్ని బడికి తెప్పించగలిగారు.  కానీ, నలభై మంది డ్రాప్​ అవుట్​. అప్పటికీ ఆయేషాకు, ఇర్ఫాన్​కు స్కూల్​ మేనేజ్​మెంట్​​ అనుభవం లేదు. అయినా ఫీల్డ్ వర్క్​ చేశారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి, స్థానిక ఆర్గనైజేషన్లతో కలిసి పిల్లల్ని మోటివేట్​ చేశారు. రకరకాల ప్రయత్నాల తర్వాత అక్కడి వాళ్లు పిల్లల్ని బడికి పంపడం మొదలుపెట్టారు. పది సంవత్సరాల తర్వాత స్కూల్​ వాతావరణం, కార్వాన్​ కుటుంబాల్లో పిల్లల పరిస్థితులు దాదాపు మారిపోయాయి. సబ్జీమండీలో పిల్లలందరినీ స్కూల్​కు తేవడంలో ఆయేషా, ఇర్ఫాన్​ సక్సెస్​ అయ్యారు. పదో క్లాస్​ చదివి మెరిట్​లో పాసైన పిల్లలకు సపోర్ట్​గా నిలిచారు. తెలిసిన కాలేజీల్లో చేర్పిస్తూ ఆర్థికంగా అండగా నిలిచారు. 
స్కాలర్​షిప్​లకు విద్యార్థులు
ఇటీవల గ్రేస్​ మోడల్​ స్కూల్​ విద్యార్థులు సాధించిన అఛీవ్​మెంట్స్​ కార్వాన్​ కుటుంబాల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. టెన్త్​ తర్వాత ఇతర కాలేజీల్లో ఫీజులు చెల్లించలేక డ్రాప్​ అవుట్​ అవుతున్న స్టూడెంట్లకు ఫైనాన్షియల్​ హెల్ప్​ చేయడం ద్వారా ఇంటర్​, డిగ్రీ చదివే సాయం చేస్తున్నారు. అలాగే స్కిల్స్​ను బట్టి  స్కాలర్​ షిప్​లకు అప్లయ్​ చేయిస్తున్నారు. అలాంటి స్టూడెంట్లే  సోహెల్​, ఖాజా బేగ్. 
ఖాజా బేగ్   తండ్రి ఆటో డ్రైవర్​గా పని చేస్తాడు. పిల్లల్ని చదివించేంత ఆర్థిక స్థోమత లేదు.  గ్రేస్​ స్కూల్​లో పదో క్లాస్​ చదివిన ఖాజా ఇంటర్​ చదవడానికి కూడా ఆయేషా సాయం చేశారు. హైదరాబాద్​లోని ఓ కాలేజీలో  ఇంటర్మీడియట్​ చదివిన  ఖాజా ఇటీవల హిమాచల్​ ప్రదేశ్​లోని నవ్​గురుకుల్​ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ కాలేజీ ఫెలోషిప్​కు ఎంపికయ్యాడు. నాలుగు సంవత్సరాలు  ఫ్రీగా చదివేందుకు  కార్వాన్​ నుంచి హిమాచల్​ ప్రదేశ్​కు నెల కిందట వెళ్లాడు ఖాజా.                                                                            ::: వినోద్​ మామిడాల

ఫీజు మూడు వందలే
పేదలందరికీ అందుబాటులో ఉండేలా మా స్కూల్​ను రన్​చేస్తున్నాం. ఎన్జీవోలు, ఆర్గనైజేషన్ల సాయంతో ఈ స్కూల్​ హై స్టాండర్డ్స్​​తో నడుస్తోంది. ఇప్పుడు నర్సరీ ఫీజు 300.   పదో క్లాస్​కి 850 రూపాయలు తీసుకుంటున్నాం. ఈ సబ్జీ మండిలో చైల్డ్​ లేబర్ అందరికీ చదువులు చెప్పించి,  పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే మా ఆశ.
                                                                                                                                                                                              - మిర్జా ఇర్ఫాన్​, కరస్పాండెంట్​ 
                                                                                                                                                                                                - ఆయేషా సిద్దిఖి, ప్రిన్సిపాల్​.
చదువుతో పాటు.. ఎక్స్​పోజర్​
 పిల్లలకు చదువు ఎంత అవసరమో.. స్కిల్స్​, పర్సనాలిటీ డెవలప్​మెంట్​ కూడా అంతే అవసరం అంటారు అయేషా. అందుకే ‘టీచ్​ ఫర్​ ఇండియా’ ఆర్గనైజేషన్​లో పని చేసే ఫ్యాకల్టీతో పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. మెథడాలజీ, యాక్టివిటీస్​, కొత్త కొత్త టెక్నిక్స్​, టూర్స్​, ఎగ్జిబిషన్స్​తో  స్టూడెంట్స్​ను ఎక్స్​పర్ట్స్​గా తయారు చేస్తున్నారు.