సోహెల్... హైదరాబాద్ కార్వాన్లో ఉంటాడు. పదో క్లాస్ పూర్తయ్యింది. తరువాతి చదువులు చదివేందుకు డబ్బు ఇబ్బందులు అడ్డుపడ్డాయి. అలాగని అతని చదువుకు ఫుల్స్టాప్ పడలేదు. తను అంతవరకు చదివిన ‘గ్రేస్ మోడల్ స్కూల్’ ఒకదారి చూపింది. దాంతో యునైటెడ్ వరల్డ్ కాలేజీ ( యూడబ్ల్యూసీ) స్కాలర్షిప్ 42 లక్షల రూపాయలు వచ్చింది. సోహెల్ చదువుకోవాలన్న కోరిక అలా తీరింది.
సోహెల్ ది చాలా పేద కుటుంబం. ఐదుగురు అన్నదమ్ములు. ఇద్దరు అక్కలు. తండ్రి ఆటో డ్రైవర్గా పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ మూడేండ్ల క్రితం ఆయన చనిపోయాడు. సోహెల్కు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం. నర్సరీ నుంచి ‘గ్రేస్ స్కూల్’లోనే చదివాడు. తండ్రి చనిపోయిన తర్వాత చదువుకోవడానికి ఇబ్బందులు వచ్చాయి. అలాగని, సోహెల్ చదువు ఆగిపోలేదు. బాధ్యతలన్నీ స్కూల్ యాజమాన్యం తీసుకుంది. ‘నన్ను చదివించింది పూర్తిగా స్కూల్ వాళ్లే. ఎస్సెస్సీ తర్వాత ఫ్యాకల్టీ సపోర్ట్తో స్కాలర్షిప్కు అప్లయ్ చేశాను. ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. ఆగస్ట్ పదిహేనో తారీఖున కన్ఫర్మేషన్ వచ్చింది. యూడబ్ల్యూసీ కాలేజీలు ప్రపంచవ్యాప్తంగా 18 ఉన్నాయి. నాకు జర్మనీలో సీట్ వచ్చింది. కానీ కొవిడ్ వల్ల ఆ కాలేజీ వాళ్లు ఇండియన్ స్టూడెంట్స్ను అనుమతించలేదు. సీట్ను ఇండియాలోని కాలేజ్కు ట్రాన్స్ఫర్ చేశారు. అలా నాకు పూనేలో సీట్ దొరికింది. మా అమ్మా వాళ్లు హ్యాపీగా ఫీలయ్యారు. రెండు సంవత్సరాలు పూనేలో చదువుకోబోతున్నాను. నాకు హ్యాపీగా ఉంది. పేద కుటుంబం నుంచి వచ్చిన నేను పై చదువులకు వెళ్లడం చాలా బాగనిపిస్తోంది. ’ అన్నాడు సోహెల్. సోహెల్ చదివిన స్కూల్ కార్వాన్లోని గ్రేస్ మోడల్ స్కూల్. పేదపిల్లల కోసమే నడుపుతున్న ప్రైవేట్ స్కూల్ ఇది. ఆయేషా సిద్దిఖీ– మిర్జా ఇర్ఫాన్ దంపతులు కట్టిన పేదవాళ్ల ప్రైవేట్ బడి. ఇటీవల ఆ స్కూల్ స్టూడెంట్స్ జాతీయ స్థాయి స్కాలర్షిప్, ఫెలోషిప్లకు సెలక్ట్ అయ్యారు. ఈ స్కూల్ పెట్టాలనే ఆలోచన సౌదీ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇర్ఫాన్కు వచ్చింది. ఆ ఆలోచన రావడానికి కారణం కార్వాన్లోని సబ్జీమండి ప్రాంతం. ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఆ మార్కెట్లో ఏదో ఒకటి అమ్ముతూ లేదా కొంటూ ఉంటారు. పెళ్లి సెలవుల కోసం సౌది నుంచి కార్వాన్ వచ్చిన ఇర్ఫాన్ ఇవ్వన్నీ చూసి ఆలోచనలో పడ్డాడు. బడికి వెళ్లాల్సిన పిల్లలు ఇలా మార్కెట్లో పని చేయడం, పాన్ షాప్ల దగ్గర, కిరాణా షాపుల్లో చైల్డ్ లేబర్లుగా పని చేయడం ఏంటనుకున్నాడు. వాళ్ల వివరాలు కనుక్కోవడం మొదలు పెట్టాడు. ‘వాళ్లు చదువుకోరు. ఇలానే పని చేస్తుంటారు’ అని తెలిసింది. వెంటనే వాళ్లకు చదువులు చెప్పించాలనుకున్నాడు. ఆయేషాతో 2002లో పెళ్లయ్యాక సౌదీకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాడు. స్కూల్ పెట్టాలని కార్వాన్లోనే ఉండిపోయాడు.
సర్కార్ బడులు సక్కగ లేకనే
సబ్జీమండిలో ఎక్కువశాతం ఉండే ముస్లిం కమ్యూనిటీ పిల్లల్ని బడికి పంపాలంటే.. ప్రైవేట్ స్కూల్ ఫీజులు భరించలేరు. సర్కార్ బడుల్లో సౌలత్లు ఉండవని అక్కడికి పంపడమే మానేశారు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం ఒక్కటే.. అదే ‘ప్రైవేట్ బడి. తక్కువ ఫీజుతో పేద పిల్లల కోసం నడిచే ప్రైవేట్ బడిని పెట్టాలి అనుకున్నారు. 2002లో ఉండి గ్రేస్ మోడల్ స్కూల్ మొదలు పెట్టారు. కరస్పాండెంట్గా ఇర్ఫాన్, ప్రిన్సిపాల్గా ఆయేషా.
ఫీజు యాభై రూపాయలు
సబ్జీ మండిలో కమ్యూనిటీ పిల్లల కోసం గ్రేస్ మోడల్ స్కూల్ ప్రారంభమైన మొదటి ఏడాది వంద మంది పిల్లల్ని బడికి తెప్పించగలిగారు. కానీ, నలభై మంది డ్రాప్ అవుట్. అప్పటికీ ఆయేషాకు, ఇర్ఫాన్కు స్కూల్ మేనేజ్మెంట్ అనుభవం లేదు. అయినా ఫీల్డ్ వర్క్ చేశారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి, స్థానిక ఆర్గనైజేషన్లతో కలిసి పిల్లల్ని మోటివేట్ చేశారు. రకరకాల ప్రయత్నాల తర్వాత అక్కడి వాళ్లు పిల్లల్ని బడికి పంపడం మొదలుపెట్టారు. పది సంవత్సరాల తర్వాత స్కూల్ వాతావరణం, కార్వాన్ కుటుంబాల్లో పిల్లల పరిస్థితులు దాదాపు మారిపోయాయి. సబ్జీమండీలో పిల్లలందరినీ స్కూల్కు తేవడంలో ఆయేషా, ఇర్ఫాన్ సక్సెస్ అయ్యారు. పదో క్లాస్ చదివి మెరిట్లో పాసైన పిల్లలకు సపోర్ట్గా నిలిచారు. తెలిసిన కాలేజీల్లో చేర్పిస్తూ ఆర్థికంగా అండగా నిలిచారు.
స్కాలర్షిప్లకు విద్యార్థులు
ఇటీవల గ్రేస్ మోడల్ స్కూల్ విద్యార్థులు సాధించిన అఛీవ్మెంట్స్ కార్వాన్ కుటుంబాల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. టెన్త్ తర్వాత ఇతర కాలేజీల్లో ఫీజులు చెల్లించలేక డ్రాప్ అవుట్ అవుతున్న స్టూడెంట్లకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం ద్వారా ఇంటర్, డిగ్రీ చదివే సాయం చేస్తున్నారు. అలాగే స్కిల్స్ను బట్టి స్కాలర్ షిప్లకు అప్లయ్ చేయిస్తున్నారు. అలాంటి స్టూడెంట్లే సోహెల్, ఖాజా బేగ్.
ఖాజా బేగ్ తండ్రి ఆటో డ్రైవర్గా పని చేస్తాడు. పిల్లల్ని చదివించేంత ఆర్థిక స్థోమత లేదు. గ్రేస్ స్కూల్లో పదో క్లాస్ చదివిన ఖాజా ఇంటర్ చదవడానికి కూడా ఆయేషా సాయం చేశారు. హైదరాబాద్లోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన ఖాజా ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోని నవ్గురుకుల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాలేజీ ఫెలోషిప్కు ఎంపికయ్యాడు. నాలుగు సంవత్సరాలు ఫ్రీగా చదివేందుకు కార్వాన్ నుంచి హిమాచల్ ప్రదేశ్కు నెల కిందట వెళ్లాడు ఖాజా. ::: వినోద్ మామిడాల
ఫీజు మూడు వందలే
పేదలందరికీ అందుబాటులో ఉండేలా మా స్కూల్ను రన్చేస్తున్నాం. ఎన్జీవోలు, ఆర్గనైజేషన్ల సాయంతో ఈ స్కూల్ హై స్టాండర్డ్స్తో నడుస్తోంది. ఇప్పుడు నర్సరీ ఫీజు 300. పదో క్లాస్కి 850 రూపాయలు తీసుకుంటున్నాం. ఈ సబ్జీ మండిలో చైల్డ్ లేబర్ అందరికీ చదువులు చెప్పించి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే మా ఆశ.
- మిర్జా ఇర్ఫాన్, కరస్పాండెంట్
- ఆయేషా సిద్దిఖి, ప్రిన్సిపాల్.
చదువుతో పాటు.. ఎక్స్పోజర్
పిల్లలకు చదువు ఎంత అవసరమో.. స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అంతే అవసరం అంటారు అయేషా. అందుకే ‘టీచ్ ఫర్ ఇండియా’ ఆర్గనైజేషన్లో పని చేసే ఫ్యాకల్టీతో పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. మెథడాలజీ, యాక్టివిటీస్, కొత్త కొత్త టెక్నిక్స్, టూర్స్, ఎగ్జిబిషన్స్తో స్టూడెంట్స్ను ఎక్స్పర్ట్స్గా తయారు చేస్తున్నారు.