బిహార్ ఎన్నికలపై బీజేపీ కుట్ర .. లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణ

బిహార్ ఎన్నికలపై బీజేపీ కుట్ర .. లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణ
  • మహారాష్ట్ర ఎన్నికల్లో  మ్యాచ్​ ఫిక్సింగ్​ చేసి గెలిచారు
  • బిహార్​లోనూ అట్లనే గెలవాలని ప్రయత్నిస్తున్నరని ఫైర్
  • మ్యాచ్–ఫిక్సింగ్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషపూరితం 
  • వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుందని రాహుల్​ ఆందోళన 

న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికలపై బీజేపీ కుట్రలు పన్నుతోందని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి పోయిన ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ‘మ్యాచ్–ఫిక్సింగ్’కు పాల్పడిందని ఆయన మరోసారి ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికలు ‘డెమోక్రసీని రిగ్గింగ్ చేసేందుకు బ్లూ ప్రింట్’లా నిలిచాయని మండిపడ్డారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అదే తరహాలో రిగ్గింగ్ చేస్తుందన్నారు. 

ఆ తర్వాత బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉన్న ప్రతీ చోట మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ మేరకు శనివారం ‘హౌ టూ స్టీల్ యాన్ ఎలక్షన్?’ అంటూ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘మ్యాచ్–ఫిక్సింగ్ మహారాష్ట్ర’ శీర్షికతో ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’లో తాను రాసిన ఆర్టికల్ ను ఆయన ఈ పోస్టుకు జోడించారు. ఏ ప్రజాస్వామ్య దేశానికైనా మ్యాచ్–ఫిక్స్డ్ ఎన్నికలు విషపూరితమని పేర్కొన్నారు. ఈ ఆటలో మోసాలతో ఒక పక్షం గెలవవచ్చు కానీ.. దాని వల్ల వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మహారాష్ట్ర ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని బీజేపీ ఎందుకు అంత తీవ్ర ప్రయత్నం చేసిందన్నది అంతుపట్టని విషయమేమీ కాదు. ఎన్నికల్లో మ్యాచ్-–ఫిక్సింగ్ ద్వారా ఒక పక్షం గెలవవచ్చు కానీ, వ్యవస్థలపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. అందుకే దేశ ప్రజలంతా ఆధారాలను చూడాలి. ఏది తప్పో, ఏది ఒప్పో తమకు తాము నిర్ణయించుకోవాలి. సమాధానాలను డిమాండ్ చేయాలి” అని రాహుల్ పిలుపునిచ్చారు.   

ఎన్నికల వ్యవస్థపై సందేహాలున్నయ్.. 

ఎన్నికల్లో ఓటర్ లిస్టులు, సీసీటీవీ ఫుటేజీలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే టూల్స్ వంటివని, అవి దాచిపెట్టాల్సిన ఆభరణాల వంటివి కావని రాహుల్ తన ఆర్టికల్ లో పేర్కొన్నారు. ఏ రికార్డులనైనా నిర్మూలించకుండా అందుబాటులో ఉంచాలని అడిగే హక్కు దేశ ప్రజలకు ఉందన్నారు. ‘‘ఒక్కసారి కాదు.. ఒక్కచోట కాదు.. తరచూ.. భారత ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతపై నాకు సందేహాలు వచ్చాయి. మన జాతీయ సంస్థలను అధీనంలోకి తీసుకునేందుకు ఇండస్ట్రియల్ లెవెల్ లో రిగ్గింగ్ జరిగింది. గతంలో కొన్ని ఎన్నికల ఫలితాలు అసాధారణంగా కనిపించాయి. కానీ, 2024 మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం చాలా వింతగా అనిపించాయి” అని ఆయన పేర్కొన్నారు.

ఓటింగ్ లెక్కల్లో తేడాలున్నయ్.. 

మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 8.98 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని.. ఐదేండ్ల తర్వాత 2024 మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 9.29 కోట్లకు పెరిగిందని రాహుల్ తెలిపారు. ఆ తర్వాత కేవలం 5 నెలలకు 2024 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓటర్లు 9.70 కోట్లకు చేరారని వెల్లడించారు. ‘‘ఓటర్ల సంఖ్య ముందుగా ఐదేండ్లలో 31 లక్షలు పెరిగితే.. తర్వాత ఐదు నెలల్లోనే 41 లక్షలు పెరిగింది. నిజానికి ప్రభుత్వ సొంత అంచనాల ప్రకారమే రాష్ట్రంలో పెద్దలు (అడల్ట్స్) 9.54 కోట్ల మంది ఉండగా.. ఓటర్లు మాత్రం అంతకంటే ఎక్కువగా ఉండటం విచిత్రం” అని ఆయన తన ఆర్టికల్ లో రాశారు.

 ‘‘పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల సమయానికి పోలింగ్ శాతం 58.22గా నమోదైంది. అయితే, వోటింగ్ ముగిసిన తర్వాత కూడా పోలింగ్ శాతం అంతకంతకూ పెరుగుతూ పోయింది. చివరకు పోలింగ్ శాతం 66.05గా నమోదైందని, అది కూడా ఆ మరుసటినాడు ఉదయం ప్రకటించారు. ఇలా అనూహ్యంగా పెరిగిన 7.83 శాతం ఓటింగ్.. 76 లక్షల ఓట్లకు సమానం. మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లోని పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. ఇది అత్యధికంగా ఉంది. అలాగే రాష్ట్రంలోని 85 నియోజకవర్గాల్లోని 12 వేల బూత్ లలో మాత్రమే కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు. ఎన్నికల్లో అక్కడ మాత్రమే బీజేపీ గెలిచింది” అని రాహుల్ ఆరోపించారు.

స్టెప్ బై స్టెప్.. ఇలా చేశారు..  

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు–2024లో దశలవారీగా ఒక క్రమ పద్ధతిలో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘ఆ ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందో నా ఆర్టికల్ స్టెప్ బై స్టెప్ వివరిస్తుంది. స్టెప్ 1:  ఎన్నికల కమిషన్ లో ప్యానెల్ నియామకాలను రిగ్గింగ్ చేశారు. స్టెప్ 2: ఓటర్ లిస్టులో భారీగా ఫేక్ ఓటర్లను చేర్చారు. స్టెప్ 3: పోలింగ్ భారీగా నమోదైనట్టుగా చూపించారు. స్టెప్ 4: బీజేపీ గెలిచేందుకు అవసరమైన చోట్లలోనే బోగస్ వోటింగ్ ను టార్గెట్ చేశారు. స్టెప్ 5: ఆధారాలను దాచేశారు” అని ఆయన తన ట్వీట్​లో పేర్కొన్నారు.  

ఆరోపణలు అసంబద్ధం: ఈసీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్–ఫిక్సింగ్ జరిగిందన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. శనివారం రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ స్పందిస్తూ.. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ లో రాహుల్ ఆరోపణలకు వివరణ ఇస్తూ గణాంకాలతో సహా విడుదల చేసిన డాక్యుమెంట్ నే తాజాగా మరోసారి విడుదల చేసింది.

 నిజానికి రాహుల్ గాంధీ ఆయా అంశాలపై సమాధానాలు కోరుతూ తమకు ఎలాంటి లేఖ రాయలేదని, కానీ మీడియా ద్వారా మాత్రమే ఆయన ప్రశ్నిస్తూ, సమాధానాలు కోరుతున్నారని తప్పుపట్టింది. పోలింగ్ సమయంలో బూత్ లలో అన్ని పార్టీలకూ ఏజెంట్లు ఉన్నారని.. ఓటింగ్ శాతంలో తేడా ఉందని వారిలో ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపింది. అలాగే ఎన్నికల జాబితాల్లో ఫేక్ ఓటర్లను చేర్చినట్లయితే.. ఏ ఒక్క పార్టీ కూడా వాటిపై 
అభ్యంతరాలు తెలపలేదని స్పష్టం చేసింది.