- నిజమైన లెక్కలను దాచిపెట్టిన కంపెనీ: సెబీ ప్రకటన
- సీఈఓ రాజేష్ ట్రేడింగ్ చేయకుండా నిషేధం
న్యూఢిల్లీ: బంగారం శుద్ధి, ఆభరణాల తయారీ వంటి వ్యాపారాలు చేసే బెంగళూరు కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (ఆర్ఈఎల్) భారీ మోసానికి పాల్పడిందని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది. గత ఐదేళ్లలో తన కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని రూ.15లక్షల కోట్లకుపైగా పెంచి చూపించిందని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. విదేశాల్లోని సబ్సిడరీలు, ముఖ్యంగా స్విట్జర్లాండ్లో ఉన్న సబ్సిడరీ కంపెనీ వాల్కంబి ద్వారా ఈ భారీ ఆదాయం వచ్చినట్లు కంపెనీ చెబుతూ వచ్చింది.
కానీ, రాజేష్ ఎక్స్పోర్ట్స్కు వాల్కంబి నుంచి నిజంగా వచ్చిన ఆదాయం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమేనని తెలిసింది. విదేశీ సబ్సిడరీల ఖాతాల ఆధారంగానే భారీ ఆదాయాన్ని చూపించారని సెబీ స్పష్టం చేసింది. 2021– 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య మొత్తం ఆదాయం రూ.15.18 లక్షల కోట్లుగా ఆర్ఈఎల్ ప్రకటించింది. కానీ, వాల్కంబి రెవెన్యూ రిపోర్ట్లతో పోలిస్తే ఇందులో దాదాపు 99.8 శాతం.. అంటే రూ.15.15 లక్షల కోట్ల ఆదాయం సరిపోలడం లేదు.
విలువైన లోహాలను శుద్ధి చేసే వాల్కంబికి కేవలం ప్రాసెసింగ్ చార్జీలు, సేవల ద్వారానే ఆదాయం వస్తుంది. రిపోర్టులు ప్రాసెసింగ్ ఫీజులను మాత్రమే ఆదాయంగా చూపించాయి. ఆర్ఈఎల్, దాని మధ్యంతర హోల్డింగ్ సంస్థ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ (జీజీఆర్) చూపిన లెక్కలకు, దీనికి చాలా తేడా ఉంది. విచారణ సమయంలో యాజమాన్యం తమ అకౌంటింగ్ సిస్టమ్స్కు యాక్సెస్ ఇవ్వలేదని, సమన్లు జారీ చేసినా సరైన వివరాలు అందజేయలేదని సెబీ పేర్కొంది.
లెక్కల్లో భారీ తేడాలు
2023లో వాల్కంబికి వచ్చిన ఆదాయం కేవలం రూ.543 కోట్లు. ఇదే సమయంలో జీజీఆర్ 2.90 లక్షల కోట్లు, ఆర్ఈఎల్ రూ.2.81 లక్షల కోట్ల ఆదాయాన్ని చూపించాయి. వాల్కంబి వాస్తవ ఆదాయం కన్సాలిడేటెడ్ ఆదాయంలో అర శాతం కంటే తక్కువగా ఉంది. ఎలాంటి స్వతంత్ర వ్యాపార కార్యకలాపాలు లేని హోల్డింగ్ కంపెనీ, మూడో పక్షం మార్కెట్ విలువను తన ఆదాయంగా ఎలా చూపిస్తుందని సెబీ ప్రశ్నించింది. దీనిపై ఆర్ఈఎల్ ఇచ్చిన వివరణను సెబీ తోసిపుచ్చింది.
బులియన్ యాజమాన్య రికార్డులు, ఇతర ఆధారాలు, ఒప్పందాల పత్రాలను కంపెనీ సమర్పించలేదని విమర్శించింది. ఈ తరహా అకౌంటింగ్ విధానం నమ్మదగ్గదిగా లేదని, కంపెనీ తన వెబ్సైట్లో ఏ ఒక్క అనుబంధ సంస్థ ఆర్థిక నివేదికను కూడా ఉంచలేదని పేర్కొంది. ఆర్ఈఎల్ ప్రమోటర్, సీఈఓ రాజేష్ మెహతా ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించింది. వాస్తవ ఆర్థిక నివేదికలు, సంబంధిత లావాదేవీల వివరాలను బయటపెట్టాలని ఆదేశించింది. తమ ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని రాజేష్ ఎక్స్పోర్ట్స్ ప్రకటించింది. తమ ఆదాయ లెక్కలు సరైనవేనని, సెబీకి కంపెనీకి మధ్య సమాచార లోపం, గందరగోళం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. సెబీ ఉత్తర్వుల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో గురువారం ఐదుశాతం తగ్గి రూ.104.65 వద్ద ముగిసింది.
ఎందుకు ఇలా చేస్తారంటే..
కార్పొరేట్ ప్రపంచంలో ఆదాయాన్ని లేదా లాభాలను వాస్తవానికి కంటే చాలా ఎక్కువగా చూపించడాన్ని విండో డ్రెస్సింగ్ అంటారు. ఇలా చేయడంవల్ల మార్కెట్లో సంస్థ షేర్ల ధరలు, మొత్తం విలువ ఆకాశాన్ని తాకుతాయి. ఫలితంగా సంస్థ యజమానుల సొంత సంపద విపరీతంగా పెరుగుతుంది. పెద్ద మొత్తంలో వ్యాపార సామ్రాజ్యం నడుస్తోందని నమ్మించి ఆర్థిక సంస్థల నుంచి భారీగా లోన్లు తీసుకోవచ్చు. దేశీయ, అంతర్జాతీయ పెద్ద పెట్టుబడిదారులను ఆకర్షించి రూ.వేల కోట్ల నిధులు సులభంగా రాబట్టడానికి ఈ తప్పుడు లెక్కలు ఉపయోగపడతాయి.
కొన్నిసార్లు కాగితాల మీదే కృత్రిమ లావాదేవీలు సృష్టించి సంస్థ నిధులను సొంత ఖాతాల్లోకి తరలించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. విదేశీ సంస్థల ద్వారా నిధులు మళ్లిస్తారు. పైకి ఇవన్నీ లాభాలుగా కనిపించినా నిజాలు బయటపడినప్పుడు పెట్టుబడిదారుల సంపద పూర్తిగా ఆవిరైపోతుంది.
