
- మాయ మాటలతో మభ్యపెడుతున్న బీజేపీ
- ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ
కామారెడ్డి, వెలుగు : నిజాలు మాట్లాడితే మీడియాపై దాడి చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం భిక్కనూరు మండలం తిప్పాపూర్కు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు షబ్బీర్అలీ సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులను మోసం చేసిందన్నారు. మాయ మాటలతో మభ్యపెట్టే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మైనార్టీలు, దళితులు, ఎస్టీలు ఆలోచించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేస్తున్నామన్నారు. లైబ్రరీ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు భీమ్రెడ్డి, నాయకులు ఇలియాస్
పాల్గొన్నారు.