
- ఏటా ఆర్థిక సంవత్సరం
- ముగిసిన ఐదార్నెళ్లకు చెల్లింపు
- గతేడాది లెక్కనే జూన్లోనే సింగరేణి యాజమాన్యం ఇవ్వాలి
- పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులకు అక్కరకొస్తాయంటున్న కార్మికులు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసిన నెలరోజుల్లోనే కోల్ఇండియా తన లాభాలను ప్రకటిస్తుంటే.. సింగరేణికి మాత్రం ఐదార్నెళ్లు పడుతుంది. దేశంలో ఏ పరిశ్రమైనా ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లోపే లాభాలు, నష్టాలు, టర్నోవర్, అప్పులు ఇతరత్రా వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా బుధవారం కోల్ఇండియా 2024– 25 ఆర్థిక సంవత్సర లాభ, నష్టాలను ప్రకటిం చింది. సంస్థ నికర లాభం రూ. 35,358 వేల కోట్లుగా తెలిపింది.
ఇదిలా ఉంటే సింగరేణి కాలరీస్కంపెనీ మాత్రం నెలల పాటు సమయం తీసుకుంటుండడం గమనార్హం. ఏటా సెప్టెంబర్, అక్టోబర్నెలల్లోనే ప్రకటిస్తుంది. ఈసారి కూడా పాత పద్ధతినే పాటిస్తుందా అనే విషయంపై కార్మికుల్లో చర్చ నడుస్తోంది. టెక్నాలజీ కాలంలోనూ లేట్ గా ప్రకటించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. నిరుడు ఒక్కసారే జూల్ లో ప్రకటించారు.
పిల్లల చదువులకు అందడంలేదు
జూన్లో పిల్లల చదువులకు డబ్బుల అవసరం ఉంటాయి. కాలేజీ, స్కూల్ఫీజులు, బుక్స్, యూనిఫాం, హాస్టల్వంటి ఖర్చులకు కార్మికుల కుటుంబాలు అప్పులు చేయడం కామన్గా మారింది. ఏటా సింగరేణి సెప్టెంబర్, అక్టోబర్నెలల్లో సంస్థ లాభాలు, బోనస్ను ప్రకటించి ఇస్తుండగా పెద్దగా అవసరం పడటం లేదనే చర్చ ఉంది. జూన్లోనే ఇస్తే తమకు మేలు చేసినట్లవుతుందని కార్మికుల కుటుంబాలు పేర్కొంటున్నాయి. సంస్థ సీఎండీ ఎన్. బలరాం ప్రస్తుతం డైరెక్టర్ఫైనాన్స్బాధ్యతలు కూడా చూస్తున్నారు. దీంతో గత ఆర్థిక సంవత్సరానికి చెందిన కంపెనీ ఆర్థిక లావాదేవీలను జూన్లో లేదంటే జూలైలోనై ప్రకటిస్తారనే ఆశతోనే కార్మికులు ఎదురు చూస్తున్నారు.
జులైలోపే ప్రకటించేలా చర్చిస్తాం..
మార్చి31తోనే ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఏప్రిల్, మే నెలల్లోపు ఆడిట్, ఇతరత్రా లెక్కలు చూసుకుని జులైలోపు టర్నోవర్, లాభాలు, అందులోని వాటాను కార్మికులను ప్రకటించే విధంగా సింగరేణి డైరెక్టర్స్, సీఎండీ స్థాయిలో జరిగే స్ట్రక్చరల్ కమిటీ మీటింగ్లో చర్చిస్తాం.
కె. రాజ్ కుమార్, జనరల్సెక్రటరీ, గుర్తింపు సంఘం(ఏఐటీయూసీ)
టెక్నాలజీ కాలంలో కూడా లేట్
సింగరేణికి వచ్చిన లాభాల్లో కార్మికులకు ఎంత వాటా ఇవ్వాలనేందుకు సమయం ఎక్కువగా తీసుకుంటుంది. టెక్నాలజీ కాలంలో కూడా జూన్లోపు సంస్థకు వచ్చిన లాభాలతో పాటు అందులో వాటాను ప్రకటించి కార్మికులకు ఇవ్వాల్సి ఉండగా సాకులు చెబుతూ మేనేజ్ మెంట్ కాలం గడుపుతుంది.
రియాజ్ అహ్మద్, ప్రెసిడెంట్, హెచ్ఎమ్మెస్