
- ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడ కొన్నరు?
- ప్రభాకర్ రావును రెండో రోజు ప్రశ్నించిన సిట్ అధికారులు
- ఎల్లుండి మళ్లీ విచారణకు రావాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారని.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎస్ఐబీతో ప్రైవేట్ వ్యక్తి అయిన శ్రవణ్ రావుకు పనేంటని అడిగారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవుతున్నారు. రెండో రోజు ఎంక్వైరీలో భాగంగా బుధవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ ముందు ఆయన హాజరయ్యారు.
రాత్రి 8 గంటల వరకు ఆయన్ను ప్రశ్నించారు. లాగర్ రూమ్ ఏర్పాటు, ఫోన్ ట్యాపింగ్ కోసం కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ పరికరాల లెక్కలపై ఆరా తీశారు. వీటికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఆయన ముందు ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం. రాజకీయ నేతలపై నిఘా కోసమే ఎస్వోటీ ఏర్పాటు చేశామని ప్రభాకర్ రావు అంగీకరించినట్లు తెలిసింది.
ప్రణీత్ రావు, శ్రవణ్ రావు స్టేట్మెంట్ల ఆధారంగానే ప్రశ్నలు
ఏ2 ప్రణీత్ రావు, ఏ6 శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లను ఎలా సేకరించారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్, సీఎంవో నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చేవనే కోణంలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రణీత్ రావు కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను ప్రభాకర్ రావు ముందుంచి విచారించారు.
కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు తనకు ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్రావును పరిచయం చేశాడని ఇప్పటికే ప్రణీత్రావు సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. శ్రవణ్ రావుకు సహకరించాలని ప్రభాకర్ రావు సూచించినట్లు ఆయన తెలిపాడు. దీంతో ప్రైవేట్ వ్యక్తి శ్రవణ్రావు ఎస్ఐబీ, ఎస్వోటీ కేంద్రంగా ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడనే వివరాలు తెలుసుకుంటున్నారు.
ఎస్ఐబీ లాగర్ రూమ్ హార్డ్డిస్క్ల నుంచి సేకరించిన ఫోన్ నంబర్లు, శ్రవణ్రావు ద్వారా ప్రణీత్రావు అందిన ఫోన్ నంబర్లను ముందుంచి ప్రభాకర్ రావును ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రధర్ గౌడ్ ఫోన్లను ఎన్ని రోజులు ట్యాప్ చేశారని ఆరా తీశారు. మళ్లీ శనివారం విచారణకు హాజరుకావాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు సహా ఎస్ఐబీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించిన టైమ్లో వినియోగించిన 2 సెల్ఫోన్లు, ల్యాప్టాప్ అప్పగించాలని ఆదేశించారు.