
- కూకట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: కరోనా కాటుకు బలవుతున్న న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు కూకట్ పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు. దీని కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి చనిపోయిన లాయర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ఉపయోగించాలని నిర్ణయించారు. కోవిడ్ వల్ల చనిపోయిన నలుగురు బార్ అసోసియేషన్ సభ్యులకు శుక్రవారం అదనపు న్యాయమూర్తి రాజేశ్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి ఇతర సభ్యులు, కోర్టు సిబ్బంది నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలో న్యాయవాదులు సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. చనిపోయిన లాయర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు ఏజీపీ గోవర్ధన్ రెడ్డి, నటరాజ, ఇతర సభ్యులు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపకల్పన చేసి కూకట్ పల్లి బార్ అసోసియేషన్ పరిధిలోని కోవిడ్ తో మృతిచెందిన కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు.