ఏపీ అసెంబ్లీలో గందరగోళం : టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో గందరగోళం : టీడీపీ సభ్యుల సస్పెన్షన్

  ఏపీ అసెంబ్లీ సమావేశాలు  రెండో రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ అంశంపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు.

  టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకు పోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు. 

సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ చదువుతున్న సమయంలో స్పీకర్ పోడియంలో టీడీపీ సభ్యులు ఈలల వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ... వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో, మార్షల్స్ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో కూడా టీడీపీ సభ్యులు ఈలలు వేసుకుంటూనే బయటకు వెళ్లారు.

గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించాం: అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ప్రకటన

 మరో వైపు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించిన రోజు గంటా స్పందిస్తూ పవిత్రమైన ఆశయం కోసం తాను రాజీనామా చేశానని చెప్పారు.