తాలిబన్ల కిరాతకం.. చంపి క్రేన్‌కు వేలాడదీశారు

తాలిబన్ల కిరాతకం..  చంపి క్రేన్‌కు వేలాడదీశారు
  • హెరాత్ నగరంలో నలుగురిని చంపి నాలుగు చోట్ల  క్రేన్ కు వేలాడ దీసిన తాలిబన్లు
  • షరియా చట్టం ప్రకారం పాలిస్తామంటూనే.. కిరాతకానికి ఒడిగట్టిన తాలిబన్ పాలకులు

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ ను చేజిక్కించుకుని పాలిస్తున్న తాలిబన్లు రోజు రోజుకూ తమ కిరాతక నిజస్వరూపాన్ని బయటపెడుతూనే ఉన్నారు. మీడియాపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా నలుగురు వ్యక్తులను చంపి.. వారి మృతదేహాలను నగరంలోని నాలుగు చోట్ల ఒక్కో క్రేన్లకు వేలాడదీసి ప్రదర్శించారు. రాజధానిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో తాము మారిపోయామని ఒకపక్క చెబుతూ.. మరో పక్క తమ అసలు స్వరూపాన్ని.. కిరాతక స్వభావాన్ని చాటుకుంటూ ప్రజలను భయంకపితులు చేస్తున్నారు. కిడ్నాపర్ల అభియోగం మోపి నలుగురిని బహిరంగంగా చంపి క్రేన్ కు వేలాడదీసి ఇదే మా హెచ్చరిక అంటూ ప్రదర్శించడం హెరాత్ నగరంలోనే కాదు మొత్తం దేశమంతా భయాందోళన సృష్టిస్తోంది. తాలిబన్ల కిరాతక ప్రవర్తన చూసి మొత్తం ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతోంది.
హెరాత్ నగరంలోని ప్రధాన కూడలిలో తాలిబన్ల కిరాతక చర్యతో ఆఫ్ఘన్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వజీర్ అహ్మద్ సిద్ధిఖీ అనే ఫార్మసీ యజమాని ఈ ఘటనను ప్రత్యక్ష సాక్షిగా మీడియాతో మాట్లాడుతూ తాలిబన్లు మొత్తం 4 మృతదేహాలను తీసుకువచ్చి ఒకదాన్ని ప్రధాన కూడలి వద్ద ప్రదర్శించారని, మిగతా మూడు మృతదేహాలను నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రదర్శించారని తెలిపాడు. కిడ్నాప్ చేశారన్న నేరంపై హతమార్చినట్టు తాలిబన్లు ప్రకటించారని సిద్ధిఖీ తెలియజేశాడు. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం పాలన సాగుతుందని ప్రకటించిన తాలిబన్లు నలుగురిని కిరాతకంగా చంపేశారని కంటతడిపెట్టుకుని భయంభయంగా తెలియజేశాడు. వీరిని కాల్చి చంపారా.. లేక చిత్రహింసలు పెట్టి హతమార్చారా? అన్నది తెలియరాలేదు. 
 

మరిన్ని వార్తల కోసం..

స్టూడెంట్స్ తయారు చేసిన 75 శాటిలైట్స్ లాంచింగ్

ప్రజల మంచి కోసం తాలిబాన్లకు అండగా నిలుద్దాం

 

ధరణి వచ్చాక అన్నదమ్ములు కొట్లాడుకోవాల్సి వస్తోంది: సీతక్క