
- సీఎం ముఖ్యకార్యదర్శిగా రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజు
- కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి
- రిటైర్ అయిన సీఎస్కు ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్, డీజీగా పోస్టింగ్
హైదరాబాద్, వెలుగు: రిటైర్డ్ అవుతున్న ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టింగ్లు ఇస్తున్నది. రీ అపాయింట్మెంట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాసరాజు సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. రెండేళ్లపాటు ఆయన ముఖ్యకార్యదర్శిగా ఉంటారని జీవోలో పేర్కొన్నారు. ఇక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా రిటైర్అయిన ఐపీఎస్ కమలాసన్ రెడ్డికి కూడా ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు ఓఎస్డీగా నియమించడంతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎస్గా రిటైర్ అయిన శాంతి కుమారికి సైతం ప్రభుత్వం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ ఆర్డీఐ) వైస్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ (ఎఫ్ఏసీ)గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే టీఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా రిటైర్డ్ ఈఎన్సీ గణపతి రెడ్డి ఇదివరకే ప్రభుత్వం నియమించింది.
సీఎంవో నుంచి ఒక్కొక్కరుగా ఖాళీ
ఇక సీఎంవోలో 4 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇందులో సీఎంవో జాయింట్ సెక్రటరీని సంగీత సత్యనారాయణను ప్రభుత్వం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్గా నియమించింది. మరొక సీఎం సెక్రటరీ షాన్వాజ్ ఖాసీంను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా అపాయింట్ కానున్నారు. మరొక పోస్టు సీఎం సీపీఆర్వో కూడా ఖాళీ కానున్నది. సీపీఆర్వో అయోధ్య రెడ్డిని ప్రభుత్వం సమాచార కమిషనర్గా నియమించనున్నది. దీంతో ప్రధాన పోస్టులన్నీ మారనున్నాయి.