
- పోలీసుల వాదనలు వినకుండా పిటిషనర్ అభ్యర్థనను ఆమోదించబోమని వెల్లడి
- విచారణ వచ్చే వారానికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాకురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించిన నిరాహారదీక్షను 72 గంటలపాటు కొనసాగించేలా ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. దీక్షను 72 గంటలపాటు చేసేందుకు అనుమతి కోరితే పోలీసులు కేవలం ఒకరోజు, అదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే అనుమతి ఇచ్చారంటూ అప్పల నరేందర్ యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ జరిపారు. పోలీసుల వాదనలు వినకుండా పిటిషనర్ అభ్యర్థనను ఆమోదించబోమని వెల్లడించారు. దీక్షను 72 గంటలపాటు కొనసాగించేలా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ముక్రమ్ అలీ వాదించారు. నిరాహార దీక్ష 72 గంటలు కొనసాగేలా ఉత్తర్వుల జారీకి జడ్జి నిరాకరించారు. అయితే, నిరాహారదీక్ష కంటెంట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదన్న పోలీసుల ఉత్తర్వులను రద్దు చేశారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.