
గద్వాల, వెలుగు: అర్హులందరికీ రుణాలు మంజూరు చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి బ్యాంకర్ల కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.25 కోట్ల రుణాలు అందించామని బ్యాంకర్లు తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల రుణ మేళాలో జిల్లాకు కేటాయించిన రుణ లక్ష్యం నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు.
రుణాల కోసం చేసుకున్న దరఖాస్తులను పెండింగ్ లో పెట్టవద్దన్నారు. జిల్లాకు కేటాయించిన రూ.1.54 కోట్ల ఎంపీ నిధులను అక్టోబర్ నెల వరకు ఖర్చు చేయాలన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఉపాధి యూనిట్లు, చిన్న, మధ్య తరహా విద్య, గృహ రుణాలతో పాటు ఇతర రంగాలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ఎల్డీఎం శ్రీనివాసరావు, ఆర్బీఐ ఏజీఎం చేతన్ గవార్కర్, నాబార్డ్ డీడీఎం మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
స్కూల్ బిల్డింగ్కు నిధులు మంజూరు
అలంపూర్: శిథిలావస్థకు చేరిన అలంపూర్ జడ్పీ హైస్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి ఎంపీ మల్లు రవి రూ.కోటి నిధులను మంజూరు చేశారు. స్కూల్ క్లాస్ రూమ్లను సోమవారం పరిశీలించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అరా తీశారు. ఎంపీ మాట్లాడుతూ బిల్డింగ్ శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వం మనఊరు–మనబడి కార్యక్రమంలో భాగంగా బిల్డింగ్ మంజూరు చేసినప్పటికీ, నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాన్నారు.
నిధులు మంజూరు చేయడంతో ఎంపీని గ్రామస్తులు శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం హాస్టళ్లు, స్కూళ్లను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీ చైర్మన్ నీలి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ పాల్గొన్నారు. జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎంపీ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, అర్చకులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.