హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ప్రోటెం ఛైర్మన్ గా ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేసిన సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వం తరపున అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యలు ఉత్తర్వులు జారీ చేశారు. మండలికి కొత్త ఛైర్మన్ ఎంపిక అయ్యేంత వరకు ఇవ్వాల్టి నుంచి కొత్త ఈ పదవిలో జాఫ్రీ కొనసాగుతారు.
హసన్ జాఫ్రి గత 12 ఏళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్నారు.
గడచిన 7 నెలల నుంచి మండలికి పూర్తి స్థాయి ఛైర్మన్ లేరు. ఇప్పటి వరకు ప్రొటెం ఛైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కొనసాగిన విషయం తెలిసిందే. కౌన్సిల్ ఛైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి గత జూన్లో రిటైర్ అయ్యారు. వెంటనే ఛైర్మన్ ప్రొటెంగా వి భూపాల్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన కూడా జనవరి 4న రిటైర్ అయ్యారు. అసెంబ్లీకి భిన్నంగా కొనసాగే మండలికి ఛైర్మన్ పదవి ఎక్కువ కాలం ఖాళీగా ఉంచడానికి లేదు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు జరగకపోవడంతో... ప్రొటెం ఛైర్మన్తో నెట్టుకు వస్తున్నారు.