- ఆ ఆర్టీఐ లెటర్ ఫేక్
- దాన్ని సృష్టించిన వాళ్లపై ఎఫ్ఐఆర్ బుక్ చేయండి- సీఈవో శశాంక్
- గోయల్కు ఎలక్షన్ కమిషన్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: దళిత బంధును ఆపాలని ఈటల రాజేందర్ కోరలేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఆర్టీఐ కింద ఈసీ సమాచారం ఇచ్చినట్లు చక్కర్లు కొడుతున్న లెటర్ ఫేక్ అని తేల్చిచెప్పింది. ఫేక్ లెటర్ క్రియేట్ చేసినవాళ్లపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి చర్యలు తీసుకోవాలని సీఈవో శశాంక్ గోయల్ను ఈసీ ఆదేశించింది. హుజూరాబాద్లో దళిత బంధు ఆపేయాలని ఈ నెల 18న ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.
సీఈవో లెటర్ ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే దళిత బంధు ఆపాలని మీరంటే, మీరే ఈసీకి లెటర్ రాశారని పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈసీ నుంచి ఆర్టీఐ ద్వారా మోహన్ మాగనేటి సమాచారం కోరినట్లు, దానికి ఈసీఐ అండర్ సెక్రటరీ గుర్ప్రీత్ సింగ్ ఈ నెల 22న సమాధానం ఇచ్చినట్లు, అందులో ఈటల రాజేందర్ పేరు ఉన్నట్లు ఒక ఫేక్ లెటర్ను మంగళవారం సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారు. ఈ ఫేక్ లెటర్పై బుధవారం స్పందించిన ఈసీ.. అసలు గుర్ప్రీత్సింగ్ పేరుతో తమ ఆర్టీఐ సెక్షన్లో ఎవరూ పని చేయడం లేదని తేల్చిచెప్పింది. ఎలాంటి లెటర్ తాము ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీఐ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ బుధవారం సీఈవో శశాంక్ గోయల్కు లెటర్ రాశారు. ఫేక్ లెటర్ సృష్టించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని అందులో ఆదేశించారు.