పాత వాటికి పైసల్లేవ్​.. కొత్తవాటికి కోట్లెక్కడివి?

పాత వాటికి పైసల్లేవ్​.. కొత్తవాటికి కోట్లెక్కడివి?
  • వెయ్యి కోట్లతో భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి,
  • కోయిల్‌సాగర్​ పూర్తిచేస్తే లక్ష ఎకరాలకు నీళ్లు

హైదరాబాద్‌, వెలుగు: పైసల్లేవని పాత ప్రాజెక్టులను పక్కన పడేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు కడ్తామని గొప్పలకు పోతోంది. కృష్ణా నదిపై రెండు లిఫ్టులతో పాటు ఒక బ్యారేజీ నిర్మిస్తామని ఇటీవల రాష్ట్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం దక్షిణ తెలంగాణ రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే కృష్ణాపై అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు  రూ. వెయ్యి కోట్లు ఇవ్వడం లేదు గానీ.. రూ. 20 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులెట్ల కడ్తారంటూ అక్కడి ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్​ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, భూసేకరణకు రూ. వెయ్యి కోట్లు విడుదల చేస్తే  దాదాపు లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందుతుంది. ఈ అంశంపై అక్కడి రైతులు పదేపదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కనీసం పెండింగ్​ బిల్లులను కూడా రిలీజ్​ చేయడం లేదు. మరోవైపు రాష్ట్ర ఖజానాలో ఉన్న నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకే మళ్లించింది. ఇప్పుడు ఉన్నఫళంగా కృష్ణా నీళ్లు గుర్తుకు వచ్చినట్లు.. కొత్త ప్రాజెక్టులు కడ్తామని చెప్పడం సందేహాలకు తెరలేపింది. పాత ప్రాజెక్టుల పనులకు రూ. వెయ్యి కోట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులెలా కడుతుంది..? ఎక్కడి నుంచి నిధులను మళ్లిస్తుంది..?  పాత ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు పూర్తి చేయకుండా ఎందుకు వదిలేసినట్లు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
వాటిని ఎందుకు పట్టించుకోట్లే?
కల్వకుర్తిపై రిజర్వాయర్‌ ఇంకా కట్టలేదు. సీఎం కొత్తగా బ్యారేజీ కడ్తమని చెప్తున్న చోట ఫిజిబిలిటీ లేదు. 855 అడుగుల లెవల్‌లో బ్యారేజీ  కడితే బీచ్‌పల్లి మునుగుతది. కృష్ణాలో నీళ్లు లేవని గోదావరి నుంచి తెస్తమన్నరు. కేసీఆర్‌ చెప్పినంకనే పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌  తెరపైకి వచ్చింది. ఏడేండ్లయినా నీటిని సోర్టేజ్‌ పెంచుకునే ఆలోచనే లేదు. చివరి దశకు వచ్చిన ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్ట్‌ ఎందుకు ముందుకు కదుల్తలేదు?        - నాగం జనార్దన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత
కాళేశ్వరంతో డబ్బులన్నీ వృథా చేశారు
తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో 33 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటిని పూర్తిచేయడానికి కేవలం 41వేల కోట్లు మాత్రమే అవసరం. ప్రాణహిత– చేవెళ్ల రీడిజైన్‌‌ చేసి లక్ష కోట్లకు పెంచారు. కాళేశ్వరం కట్టి డబ్బులన్నీ వృథా చేశారు. ఈ డబ్బులతో కృష్ణా ప్రాజెక్టుపై కాన్సంట్రేట్‌‌ చేస్తే ఎంతో ఉపయోగపడేది.   
                                                                                                                                            - దొంతుల లక్ష్మీనారాయణ, కన్వీనర్‌‌, తెలంగాణ ఇంజనీర్స్‌‌ ఫోరం

పాలమూరు పడావుబెట్టి..
కృష్ణా ప్రాజెక్టులపై ప్రభుత్వం మొదటి నుంచీ నిర్లక్ష్యం చూపుతోంది. పాలమూరు ప్రాజెక్టును రీ డిజైన్‌‌ పేరుతో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చింది. ప్రాజెక్టులోనూ మార్పులు చేసింది. 2018లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నా, నిధులు ఇవ్వకపోవడంతో నిర్మాణ వ్యయం రూ. 35 వేల కోట్ల నుంచి 55 వేల కోట్లకు పెరిగింది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయాల్సిన ఈ ప్రాజెక్టును తర్వాత ఒక టీఎంసీకే పరిమితం చేసింది. ప్రాజెక్టు ఫస్ట్​ పంపుహౌస్‌‌ (ఎల్లూరు)ను  మొదట ఓపెన్‌‌  కట్‌‌గా ప్రతిపాదించి తర్వాత అండర్‌‌  గ్రౌండ్‌‌కు మార్చారు. అండర్‌‌ గ్రౌండ్‌‌ పంపుహౌస్‌‌ కోసం చేసిన బ్లాస్టింగ్స్‌‌తో కల్వకుర్తి పంపుహౌస్‌‌ మునిగిపోయింది. నార్లాపూర్‌‌ రిజర్వాయర్‌‌ సామర్థ్యాన్ని 8 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు తగ్గించినా నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేశారు. డిండి ప్రాజెక్టుకు  ఎక్కడి నుంచి నీళ్లు తీసుకోవాలనే దానిపై సర్వేల పేరుతోనే కోట్లు వృథా చేశారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల కోసం రూ. 1.17 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఇందులో కృష్ణా బేసిన్‌‌ ప్రాజెక్టుల ఖర్చు రూ. 30 వేల కోట్లలోపే ఉంది. ఇందులో పాలమూరు ప్రాజెక్టుకు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశారు. మిగతా ఆన్‌‌గోయింగ్‌‌, పెండింగ్‌‌ ప్రాజెక్టులకు మిగతా మొత్తం వెచ్చించారు. ఇందులో రూ. 5 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌‌లో ఉండటంతో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు  రెడీగా లేరు. బడ్జెట్‌‌ కేటాయింపుల్లోనూ కృష్ణా బేసిన్‌‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. వేల కోట్ల పనులు చేయాల్సిన చోట వంద కోట్ల లోపే బడ్జెట్‌‌ కేటాయింపులు చేసింది. అందులోనూ సగం నిధులు కూడా ఖర్చు చేయలేదు.
నీళ్లందని ఆయకట్టు
కృష్ణా ప్రాజెక్టులకు నిధులివ్వకపోవడంతో పనులు పూర్తికాక లక్షల ఎకరాలు బీడుగానే ఉంటున్నాయి. కల్వకుర్తి కాల్వల కెపాసిటీ చుక్క కూడా పెంచలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా..  రూ.1,653 కోట్ల బిల్లులు పెండింగ్​లో  ఉన్నాయి. దీనికింద ఇంకో 1.17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా పనులు పూర్తి కాక నీళ్లు అందటం లేదు.  
రూ. వెయ్యి కోట్లు ఇవ్వక..
జూరాల ప్రాజెక్టు ఆధారంగా ఏర్పాటు చేసిన భీమా, నెట్టెంపాడు, కోయిల్‌‌సాగర్‌‌  లిఫ్టుల ప్రధాన కాల్వలతో పాటు డిస్ట్రిబ్యూటరీల పనులు పెండింగ్‌‌లో పెట్టారు. ఫలితంగా భీమా కింద 45 వేల ఎకరాలు, నెట్టెంపాడు కింద 50 వేల ఎకరాలు, కోయిల్‌‌ సాగర్‌‌ కింద 12 వేల ఎకరాలకు నీళ్లు అందడం లేదు. ఈ 4 ప్రాజెక్టులకు కలిపి భూసేకరణ, ఆర్‌‌  అండ్‌‌  ఆర్‌‌, ఇతర పనులకు రూ. 1,000 కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా, రాష్ట్ర సర్కారు రూపాయి కూడా ఇవ్వలేదు. నల్గొండ జిల్లాలో  లక్ష ఎకరాలకు నీళ్లిచ్చే ఉదయసముద్రం లిఫ్ట్‌‌ పనులు ఏండ్లుగా సాగుతూనే ఉన్నాయి. దీంతో ఆ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లు అందట్లేదు. ఏఎమ్మార్‌‌ ఎస్‌‌ఎల్బీసీ ఎత్తిపోతల పనులు పెండింగ్‌‌లో ఉండటంతో 30 వేల ఎకరాలకు నీళ్లు అందట్లేదు.
20 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులు
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కృష్ణా ప్రాజెక్టుల కోసం రూ. 30 వేల కోట్లలోపే ఖర్చు చేశారు. ఇప్పుడు కొత్తగా శ్రీశైలం బ్యాక్‌‌ వాటర్‌‌లో  3.82 కి.మీ.ల పొడవైన భారీ బ్యారేజీ, సర్జ్‌‌పూల్‌‌, పంపుహౌస్‌‌, అక్కడి నుంచి ఏదుల రిజర్వాయర్‌‌  వరకు సుమారు 30 కి.మీ.ల పైపులైన్‌‌  వేసేందుకు రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కల్వకుర్తి రిజర్వాయర్ల​కు 2016లోనే రూ.5 వేల కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. ఇప్పుడు వీటి వ్యయం రూ.6 వేల కోట్లకుపైగా పెరుగనుంది. మిగతా ప్రాజెక్టులు, కాల్వలు, ఇతర పనులు, భూసేకరణకు ఇంకో రూ. 8 వేల  కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం కలిపి రూ. 20 వేల కోట్లు కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆన్‌‌గోయింగ్‌‌ ప్రాజెక్టులకే నిధులివ్వని ప్రభుత్వం, ఈ ప్రాజెక్టుల కోసం అంత భారీ మొత్తం ఎక్కడి నుంచి తీసుకువస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మూడేండ్లలో కృష్ణా ప్రాజెక్టులకు చేసిన బడ్జెట్‌‌ కేటాయింపులు (రూ.కోట్లలో)
ప్రాజెక్టు    2019-20    2020-21    2021-22
పాలమూరు - రంగారెడ్డి    500    368.58    960
డిండి లిఫ్ట్‌‌    90.87    56.05    545.42
ఎస్‌‌ఎల్బీసీ    3    3.16    331.41
కల్వకుర్తి    4    2.29    75
నెట్టెంపాడు    25    16.70    192.75
భీమా    25    3.69    57
కోయిల్‌‌సాగర్‌‌    25    17.40    21.16
ఆర్డీఎస్‌‌    27.50    19.35    40

కేంద్రంపై నెపం వేయాలని చూస్తున్నరు
కేసీఆర్‌‌ ఊసరవెల్లిగా రంగులు మారుస్తు న్నరు. కేంద్రం మీద నెపం వేయాలని చూస్తున్నరు. ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌లో తట్టేడు మట్టిని కూడా ఎందుకు తీయలేదు. అక్కడికి పోయి కుర్చీ వేసుకుని టన్నెల్‌‌ తవ్విస్తమన్నరు.. నక్కలగండి ప్రాజెక్ట్‌‌ను  పూర్తి చేయట్లేదేం? గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను ఎందుకు తీసుకురావడంలేదు? దక్షిణ తెలంగాణ పట్ల టీఆర్‌‌ఎస్‌‌కు ఉన్న వివక్ష కారణంగానే కృష్ణా పోయినా ఫర్వాలేదని ఊరుకుంటున్నరు.  - ప్రకాశ్‌‌రెడ్డి, బీజేపీ నేత