
- నవంబర్ 8 నుంచి ఆంక్షల ఎత్తివేత
- 18 ఏండ్ల లోపు వాళ్లకు వ్యాక్సిన్ కండీషన్ నుంచి మినహాయింపు
- బోర్డింగ్ టైమ్లోనే కరోనా నెగెటివ్ రిపోర్టు చూపెట్టాలి
- అప్డేట్ చేసిన ట్రావెల్ గైడ్లైన్స్ రిలీజ్ చేసిన వైట్హౌస్
వాషింగ్టన్: అమెరికా తలుపులు తెరుచుకుంటున్నాయి. ట్రావెల్ గైడ్లైన్స్ను రివైజ్ చేసిన అగ్రరాజ్యం.. చైనా, ఇండియా సహా పలు దేశాలపై విధించిన ట్రావెల్ ఆంక్షలను ఎత్తేయాలని నిర్ణయించింది. విదేశీ పౌరులు నవంబర్ 8 నుంచి తమ దేశంలోకి వచ్చేందుకు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఓకే చెప్పారు. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నోళ్లకే పర్మిషన్ ఇస్తున్నారు. అమెరికాకు వెళ్లే వాళ్లు.. బోర్డింగ్ టైమ్లోనే కరోనా నెగెటివ్ రిపోర్టు చూపెట్టాలని వైట్హౌస్ ప్రకటించింది. అప్డేట్ చేసిన ట్రావెల్ గైడ్లైన్స్ను సోమవారం (అక్కడి టైం ప్రకారం) జారీ చేసింది.
ప్రూఫ్ చూపెట్టాలి
కొత్త అంతర్జాతీయ ఎయిర్ ట్రావెల్ సిస్టమ్ ప్రకారం.. ఇతర దేశాల వాళ్లు అమెరికాకు పోవాలంటే వ్యాక్సిన్ ఫుల్గా వేసుకోవాలి. విమానంలో ఎక్కేటప్పుడే వ్యాక్సినేషన్ స్టేటస్ను ప్రూఫ్గా చూపెట్టాలి. ప్యాసింజర్ చూపిన ప్రూఫ్లోని పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇతర సమాచారం నిజమా కాదా, ప్రూఫ్లో ఉన్న వివరాలు, ప్యాసింజర్ వివరాలు ఒక్కటేనా, అది ప్రభుత్వం జారీ చేసినదేనా అనేది ఎయిర్లైన్స్ చెక్ చేసుకోవాలి. సదరు వ్యాక్సిన్లు ఎఫ్డీఏ ఆమోదించిన లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన లిస్టులో ఉండాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) స్పష్టం చేసింది. ఆయా గుర్తింపులు ఉన్న వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లనే అమెరికాలోకి అనుమతిస్తారు.
వీళ్లకు మినహాయింపు
ప్రస్తుతం పిల్లలకు వ్యాక్సిన్ వేయడంలేదు. దీంతో తమ దేశంలోకి వచ్చే18 ఏండ్లలోపు వాళ్లను వ్యాక్సినేషన్ నుంచి అమెరికా మినహాయించింది. ఆరోగ్య సమస్యల వల్ల వ్యాక్సిన్ వేసుకోని వాళ్లు, అత్యవసరంగా అమెరికాకి వచ్చే వాళ్లు (అమెరికా ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్ ఉండాలి), వ్యాక్సిన్లు తక్కువగా పంపిణీ జరుగుతున్న దేశాల నుంచి నాన్ టూరిస్ట్ వీసా ద్వారా వచ్చే వాళ్లను వ్యాక్సిన్ రూల్స్ నుంచి మినహాయించారు. అయితే వీళ్లలో ఎవరైనా అమెరికాలో 60 రోజుల కంటే ఎక్కువ ఉంటే.. అక్కడి వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అంగీకారం తెలుపుతూ ముందుగానే లెటర్ ఇవ్వాలి.
టెస్టింగ్ ప్రోటోకాల్స్ ఇలా..
టెస్టింగ్ ప్రోటోకాల్స్ను కూడా అమెరికా మార్చింది. టీకాలు వేసుకోని ప్రయాణికులు (అమెరికా పౌరులు, చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు(ఎల్పీఆర్) లేదా ప్రభుత్వం ఆమోదించిన విదేశీ పౌరులు).. బయలుదేరడానికి ఒకరోజు ముందే కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. 2 నుంచి 17 ఏండ్ల మధ్యనున్న వాళ్లు డిపార్చర్కు ముందుగా టెస్టు చేయించుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తి, 18 ఏండ్లలోపు వాళ్లతో ట్రావెల్ చేస్తుంటే.. డిపార్చర్కు 3 రోజుల ముందుగానే టెస్టులు చేయించుకోవాలి.