హైదరాబాద్: టమాటా రైతులు ఇప్పుడు ఫుల్ ఖుషీ! భారీ ధరల కారణంగా వాళ్ల జేబులు ఫుల్లుగా కనిపిస్తున్నాయి. టమాటాలు తమను కోటీశ్వరులను చేస్తాయని వాళ్లు ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. తెలంగాణలోని పులుమామిడి గ్రామానికి చెందిన అనంత్ రెడ్డి తన ఎకరం టమాటా పంట నుంచి రూ. 20 లక్షలు సంపాదించారు. ఆ డబ్బుతో కొత్త ట్రాక్టర్తోపాటు హ్యుందాయ్ వెన్యూ కారును కొన్నారు. కర్ణాటకలోని జలబిగానపల్లి గ్రామ రైతు 35 ఏళ్ల అరవింద్ తన 5 ఎకరాల పొలంలో టమాటా వేసి రూ. 1.4 కోట్లు సంపాదించారు. అంగన్వాడీ వర్కర్ అయిన తన తల్లి కోసం లగ్జరీ ఇల్లు కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కరకమండ గ్రామానికి చెందిన సోదరులు పసలప్పగారి చంద్రమౌళి, పసలప్పగారి మురళి పది లక్షల కిలోలకు పైగా టమాటాలు అమ్మి రూ.మూడు కోట్లు వెనకేశారు.
తెలంగాణలోని సయ్యద్పల్లె గ్రామవాసి అరపతి నర్సింహా రెడ్డిది ఇలాంటి కథే! టమాటాలు సాధారణంగా (20 కిలోల బాక్స్కు) రూ. 300కి అమ్ముడవుతాయని, ఇప్పుడు ధరలు ఊహించలేనంతగా ఉన్నాయని చెప్పారు. గిట్టుబాటు ధర రాక కొన్నిసార్లు వాటిని కాలువలలో కూడా పడేశానంటూ గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం కూడా అకాల వర్షాలు రాకుంటే దిగుబడి ఇంకా ఎక్కువ ఉండేదని చెప్పారు. వాతావరణం సరిగ్గా లేకపోవడం, ధరలు తక్కువగా ఉండటం వల్ల తెలంగాణలో టమాటా సాగు విస్తీర్ణం 25 వేల నుంచి 2 వేల ఎకరాలకు పడిపోయింది. అధిక కూలీ, ఛార్జీలు కూడా సాగును కష్టతరం చేశాయి. భారీగా టమాటాలు పండించిన నర్సింహ, అనంత్ వంటి రైతులు జాక్పాట్ కొట్టారు.
ఒక్కో పెట్టెకు రూ. మూడు వేల ఆదాయం వస్తుందని నర్సింహ ఊహించనే లేదు. "కొన్ని రోజుల్లో రేటు 4వేల రూపాయలకు చేరుకుంటుంది. ఇంత ధరలు వస్తాయని కలలోనూ ఊహించలేదు. మా గ్రామంలోని 150 మంది రైతులు కలిసి టమాటాలు సాగు చేస్తే రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు సంపాదించేవారు” అని ఆయన అన్నారు. కర్ణాటకలోని పాల్య గ్రామానికి చెందిన సీతారామ రెడ్డి గత ఆరు వారాల్లో రూ. 1.5 కోట్లు జేబులో వేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు టమాటాల ద్వారా కనీసం రూ. 50 లక్షలు సంపాదిస్తానని చెప్పారు.
పట్టుదల, కష్టంతో విజయం..
ఈ రైతుల ఆలస్య విజయానికి పట్టుదల కీలకమని చెప్పాలి. ఈ ఏడాది ఫిబ్రవరి–-ఏప్రిల్ మధ్య టమాటా ధరలు పతనమైనా పసలప్పగారి సోదరుల వంటి వారు భయపడలేదు. మళ్లీ టమాట సాగు చేసి రూ.కోట్లు సంపాదించారు. మధ్యప్రదేశ్లోనూ టమాటాకు ఫుల్లు గిరాకీ ఉంది. భారతదేశంలో అతిపెద్ద టమాటా ఉత్పత్తి కేంద్రం ఇది. ధరలు పెరగకముందే తమ ఉత్పత్తులను విక్రయించినందున అక్కడి రైతులు పెద్దగా లాభం పొందలేదు. శివపురిలో 16 సంవత్సరాలుగా టమాటాలు పండిస్తున్న రైతు నివేష్ జాత్ మాట్లాడుతూ తమ దగ్గర సరుకు అయిపోయిందని, ఇప్పుడు టమాటాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తున్నాయంటూ బాధపడ్డారు.