న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్ మార్చి నెల నుంచి చేపట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఏప్రిల్లో ఈ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని, తొలి రైలును ఢిల్లీ – ముంబైల మధ్య ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైలులో 16 నుంచి 20 (ఏసీ, నాన్-ఏసీ) కోచ్లు ఉంటాయి.
వీటితో దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రాత్రి వేళలో ఎక్కువ ప్రయాణ దూరం ఉండే రూట్లలో వందేభారత్ స్లీపర్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తున్నది. ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో ఉన్న సర్వీస్ల కంటే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. తొలి దశలో పది రూట్లలో 10 స్లీపర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తున్నది.