
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఉత్తర బస్తర్ను ఆనుకుని ఉన్న మదన్వాడ పోలీస్స్టేషన్ పరిధిలోని రెటెగావ్, -కరెకట్టా గ్రామాల మధ్య మావోయిస్టులు సమావేశం అయ్యారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఆర్జీ, ఐటీబీపీ బలగాలు బండా పర్వత ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బలగాల రాకను గమనించిన మావోయిస్టులు గుట్టపై నుంచి కాల్పులు జరిపారు.
దీంతో భద్రతాబలగాలు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు చనిపోగా, మరికొందరికి గాయాలు అయ్యాయని రాజ్ నంద్గావ్ ఐజీ అభిషేక్ శాండిల్య చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం వద్ద కేంద్ర కమిటీ సభ్యుడు విజయ్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు లోకేశ్ సలామే ఉన్నట్లు తెలుస్తోంది. అడవుల నుంచి బలగాలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐజీ తెలిపారు.