- ఇద్దరూ ఎస్సెస్సీ స్టూడెంట్లే.. ఒకరు మృతి.. మరొకరికి సీరియస్
- ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ డ్యాం వద్ద ఘటన
ఆదిలాబాద్టౌన్(జైనథ్), వెలుగు: ఆదిలాబాద్జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ డ్యాంలో ఇద్దరు ఎస్సెస్సీ విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో పడిపోయారు. ఇందులో ఒకరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పశువుల కాపర్లు, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జైనథ్ మండల కేంద్రానికి చెందిన పారిక్ ప్రీతి, పాటిల్ ప్రియాంక స్నేహితులు. వీరు స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. జైనథ్కు కిలోమీటర్ దూరంలోని స్కూల్కు రోజూ నడుచుకుంటూ వెళ్తారు. స్కూల్నుంచి డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. బుధవారం వీరిద్దరు స్కూల్కు వెళ్లలేదు.
మధ్యాహ్నం వేళలో లక్ష్మీపూర్ డ్యాం వద్ద గొర్రెల కాపరులకు కనిపించారు. డ్యాం పక్కనే పశువులు కాస్తున్న ఓ వ్యక్తి ప్రీతి, ప్రియాంకలు డ్యాంలో పడిపోవడాన్ని గమనించాడు. వెంటనే అతడు డ్యాంలోకి దిగి ప్రీతిని ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే ప్రియాంక మునిగిపోవడంతో చనిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని రిమ్స్కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఇద్దరూ స్కూల్కు వెళ్లకుండా డ్యాంకు ఎందుకు వెళ్లారు? అక్కడేం జరిగింది అనేది తెలియడం లేదు. డ్యాం దగ్గర ప్రీతికి చెందిన స్కూల్ బ్యాగ్ దొరికిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రీతి కోలుకుని ఏమైనా చెప్తేనే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులంటున్నారు.