
జడ్చర్ల, వెలుగు : కరెంట్ పోల్ నాటేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటకు చెందిన గుమ్మకొండ ఆంజనేయులు (30)కు బండమీదిపల్లి శివారులో వ్యవసాయ భూమి ఉంది. శనివారం మెషీన్తో వరి కోస్తుండగా అది విద్యుత్ స్తంభానికి తగలడంతో స్తంభం విరిగిపోయింది.
దీంతో కొత్త స్తంభం నాటేందుకు ఆదివారం ఆంజనేయులు విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న, బండమీదిపల్లికి చెందిన మనీశ్కుమార్(27)ను తీసుకెళ్లాడు. స్తంభం నాటడానికి ట్రాక్టర్ డిగ్గింగ్ మెషీన్తో గుంత తీస్తున్నారు. ఈ క్రమంలో డిగ్గింగ్ మెషీన్ కరెంట్ వైర్లకు తగలడంతో.. ట్రాక్టర్ను పట్టుకున్న ఆంజనేయులు, మనీశ్కుమార్కు షాక్ కొట్టింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు.