మే 5న కేంద్ర మంత్రి నితిన్ ​గడ్కరీ రాక

మే 5న కేంద్ర మంత్రి నితిన్ ​గడ్కరీ రాక
  • బీహెచ్ఈఎల్ ​ఫ్లైఓవర్​ను జాతికి అంకితం చేయనున్న మంత్రి
  • ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ రఘునందన్​రావు

రామచంద్రాపురం, వెలుగు: రామచంద్రాపురంలో ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు, నాయకులు గడ్కరీ పర్యటనను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా లింగంపల్లి  బీహెచ్ఈఎల్​ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్​ను మంత్రి జాతికి అంకితం చేస్తారు. గడ్కరీ పర్యటన నేపథ్యంలో ఎంపీ రఘునందన్​రావు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు పార్లమెంట్ ప్రాంతాలను కలిపే బీహెచ్ఈఎల్​ ఫ్లైఓవర్​ ట్రాఫిక్​ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలవనుందని పేర్కొన్నారు.

ఉమ్మడి మెదక్​ జిల్లాకు ముఖ ద్వారమైన లింగపల్లిలో సిగ్నల్​ లెస్​ఫ్లైఓవర్​ నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్ల నిధులను కేంద్రం కేటాయించిందని తెలిపారు. శరవేగంగా బ్రిడ్జి పనులు పూర్తి చేసిన నేషనల్​ హైవే అథారిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముంబై జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించి, ప్రత్యేకంగా సర్వీస్​ రోడ్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమానికి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ హెచ్ఐ రీజినల్​ఆఫీసర్​కృష్ణప్రసాద్, నాయకులు రవికుమార్​యాదవ్, ఎడ్ల రమేశ్, రాంబాబు, నర్సింగ్ గౌడ్, ఈర్ల రాజు పాల్గొన్నారు.