అమెరికా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) చీఫ్ మధు గొట్టుముక్కల వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ChatGPTలో అప్లోడ్ చేయడంతో సంచలనంగా మారింది.
సమాచారం ప్రకారం అమెరికా ప్రభుత్వ నెట్వర్క్లను, కీలక వ్యవస్థలను సైబర్ దాడుల నుండి రక్షించాల్సిన బాధ్యత CISA సంస్థపై ఉంటుంది. అలంటి సంస్థకు చీఫ్ గా ఉన్న మధు గొట్టుముక్కల, ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫైళ్లను ChatGPT పబ్లిక్ వెర్షన్లోకి అప్లోడ్ చేశారు.
నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి AI టూల్స్ వాడకూడదని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కానీ, ఆయన ChatGPT వాడేందుకు అనుమతి తీసుకున్నారు.
ALSO READ : కుప్పకూలిన గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్..
మనం ChatGPTలో ఏదైనా సమాచారం ఇస్తే, ఆ డేటాను OpenAI సంస్థ దాని సాఫ్ట్వేర్కు శిక్షణ ఇవ్వడానికి వాడుకుంటుంది. అంటే ప్రభుత్వ రహస్యాలు బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఆయన రహస్య సమాచార డాకుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు ప్రభుత్వ భద్రతా వ్యవస్థలు (Alarms) వెంటనే అప్రమత్తమై అధికారులను హెచ్చరించాయి. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
సైబర్ భద్రతను కాపాడాల్సిన వ్యక్తే ఇలా అజాగ్రత్తగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన ChatGPT వాడటానికి పట్టుబట్టి అనుమతి తీసుకున్నారని, తీరా తీసుకున్నాక దాన్ని తప్పుగా వాడారని తోటి అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : కొత్త ఆధార్ యాప్ వచ్చేసింది..
మధు గొట్టుముక్కలకు ఐటీ రంగంలో 24 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన గత ఏడాది జూలై వరకు మాత్రమే ఈ యాప్ను వాడారని, అది కూడా అనుమతితోనే జరిగిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే, భద్రత విషయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా రాజకీయ, సైబర్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
