కొండపాక/సిద్దిపేట రూరల్, వెలుగు: ‘కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు, బీఆర్ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణ కల సాకారమైంది’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు. ఆదివారం కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో జరిగిన చౌడవాలమ్మ దేవాలయ వార్షికోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ పుట్టడం వల్లే దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో, స్వయంపాలనలో సంతోషంగా గడుపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, 33 జిల్లాలుగా పరిపాలన సాగుతున్నా, సిద్దిపేట జిల్లా ఏర్పడినా.. అదంతా కేసీఆర్ కృషే అని చెప్పారు. కేసీఆర్.. నాలుగు కోట్ల ప్రజలను ఒక్క తాటి మీదకు తెచ్చి, ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయారని కొనియాడారు.

