‘భూభారతి’లో.. పీవోటీ అప్లికేషన్లే ఎక్కువ

‘భూభారతి’లో.. పీవోటీ అప్లికేషన్లే ఎక్కువ
  • యాదాద్రిలో ముగిసిన రెవెన్యూ సదస్సులు
  • పైలెట్ మండలంలో 712 అప్లికేషన్లు
  • పీవోటీ అప్లికేషన్లు 584
  • ఇందులో అసైన్డ్​ల్యాండ్​ 236, సాదాబైనామా 116
  • ఇతర సమస్యలపై 232 అప్లికేషన్లు

యాదాద్రి, వెలుగు : భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన సదస్సుల్లో పీవోటీ (ప్రొహిబిటెడ్​ ఆఫ్​ ట్రాన్స్​ఫర్) అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయి. వీటిలో అసైన్డ్​ భూముల యాజమాన్య మార్పిడి, 2014 తర్వాత జరిగిన క్రయవిక్రయాలకు సంబంధించి సాదాబైనామా అప్లికేషన్లు ఉన్నాయి. 

1,828 అప్లికేషన్ల పంపిణీ..

భూభారతి చట్టం అమలులో భాగంగా ఒక్కో జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలెట్​ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో ఆత్మకూరు(ఎం) మండలాన్ని పైలెట్​గా ఎంపిక చేశారు. ఈ మండలంలోని 17 గ్రామాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా 1,828 అప్లికేషన్లను ఆఫీసర్లు పంపిణీ చేశారు. ఈనెల 5 నుంచి 15 వరకు ప్రజల నుంచి 712 అప్లికేషన్లను స్వీకరించారు. 

పీవోటీ అప్లికేషన్లే ఎక్కువ..

చట్టంలో పేర్కొనని వాటిని పరిష్కరించాలని కోరుతూ 584 పీవోటీ (ప్రొహిబిటెడ్​ ఆఫ్​ ట్రాన్స్​ఫర్) అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అసైన్డ్​ల్యాండ్​ రిజిస్ట్రేషన్​ కోసం  236, 2014 జూన్​ 2 తర్వాత జరిగిన భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన 116 సాదాబైనామాలకు సంబంధించినవి వచ్చాయి. ఇతర సమస్యలకు సంబంధించిన 232 అప్లికేషన్లు వచ్చాయి. ఇవే కాకుండా భూభారతి చట్టంలో పేర్కొన్న మాడ్యూల్స్​కు సంబంధించిన మరో 128 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 120 అప్లికేషన్లను ఆన్​లైన్​ చేయడంతోపాటు 97 నోటీసులు జారీ చేశారు. 

అసైన్డ్ ల్యాండ్​మార్పిడికి.. 

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్​కొనుగోలు చేసినవారిలో 236 మంది.. తమకు రిజిస్ట్రేషన్​తోపాటు పట్టదారు పాస్​ బుక్స్ ఇప్పించాలని అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ మండలలోని 136 సర్వే నంబర్​లో 226 ఎకరాలను గతంలో అసైన్డ్ చేశారు. ఇందులో తాము 64 ఎకరాలను కొనుగోలు చేసినట్టు కొందరు, 358 సర్వే నంబర్​లో 46 ఎకరాలను కొనుగోలు చేసినట్టు మరికొందరు అప్లికేషన్లు చేసుకున్నారు. మొత్తంగా ఈ రెండు సర్వే నంబర్లలో కలిపి 236 మంది 110 ఎకరాలను తమకు రిజిస్ట్రేషన్ చేయించాలని అప్లికేషన్​చేసుకున్నారు. వీరిలో ఒక్కొక్కరు 5 గుంటల నుంచి ఎకరం వరకు కొనుగోలు చేశారు. రూల్స్ ప్రకారం హెచ్ఎండీఏ, మండల హెడ్​క్వార్టర్​సమీపంలో అసైన్డ్​ల్యాండ్​అమ్మడం, కొనడం నేరమని, ఈ భూమి బదలాయింపు జరగదని ఆఫీసర్లు చెబుతున్నారు. అప్లికేషన్లు చేసుకున్న వారికి ఫారం 1, 2 నోటీసులు జారీ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆ తర్వాత అసైన్డ్​చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయని స్పష్టం చేస్తున్నారు. 

2014 తర్వాత సాదాబైనామాలకు..

సాదాబైనామాలకు సంబంధించి 116 అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రయవిక్రయాలు జరిగాయి. రూల్స్​ప్రకారం ఇవి చెల్లవు. కాబట్టి ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించదు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 జూన్ 2 వరకు క్రయవిక్రయాల జరిగిన భూములకు రూల్ 6, సెక్షన్ 6 ప్రకారం యాజమాన్య హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ సాదాబైనామాలకు సంబంధించి గత ప్రభుత్వం 2020 అక్టోబర్​12 నుంచి 2020 నవంబర్ 10 వరకు 15,994  అప్లికేషన్లు స్వీకరించింది. వీటిలో 8,741 తిరస్కరించి, 7,293 అప్లికేషన్లను ఓకే చేసింది. అయితే ధరణిలో సాదాబైనామాల పరిష్కారానికి ఆప్షన్‌‌ లేకపోవడంతో పెండింగ్ లోనే ఉన్నాయి.

జూన్​2లోగా పరిష్కారం మండలంలో రెవెన్యూ సదస్సులు ముగిశాయి. సమస్యలపై వచ్చిన అప్లికేషన్లు పరిశీలించి ఆన్​లైన్​ చేస్తున్నాం. కొందరికీ నోటీసులు ఇచ్చాం. వివాదం లేని భూముల సమస్యలపై జూన్​2 నాటికి పరిష్కారం చూపిస్తాం. ​

 వీరారెడ్డి, అడిషనల్​కలెక్టర్, యాదాద్రి 

మరికొన్ని అప్లికేషన్లు ఇలా..

మిస్సింగ్​ సర్వే నంబర్లు    11
పెండింగ్​ మ్యుటేషన్​    04
సంతకం పెండింగ్​    08
విస్తీర్ణంలో తేడాలు    25
పేర్లలో తప్పులు    08
లావణి పట్టా    07
అసైన్డ్​ ల్యాండ్​పార్టిషన్​    02
ఫౌతి    22
ఇతర సమస్యలు    41