సబ్సిడీ ‘డ్రిప్’ పై రైతుల ఆసక్తి

సబ్సిడీ ‘డ్రిప్’ పై రైతుల ఆసక్తి
  • 2025–-26లో రూ. 3 కోట్లు మంజూరు
  • ఈ ఇయర్‌‌లో ఇప్పటికే 1116  ఎకరాల్లో ఇన్​స్టాలేషన్
  • రూ.  2.91 కోట్లు వ్యయం​
  • ఎస్సీ, ఎస్టీ రైతుల అప్లికేషన్స్​ ప్రాసెస్​

యాదాద్రి, వెలుగు: సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్‌ను  రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. 2025–-26 ​ మధ్యలోనే రిలీజ్​అయిన ఫండ్స్​లో జనరల్​ కోటా ఖర్చు అయింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కోటాకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది.  తక్కువ నీటి వనరులతో ఎక్కువ భూమిని సాగు చేయడానికి డ్రిప్​ ఇరిగేషన్​ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డ్రిప్​ ఇరిగేషన్​ను డెవలప్​మెంట్​చేయడానికి రైతులకు 80 శాతం నుంచి వంద  శాతం వరకూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. 

ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో ఇస్తుండగా, బీసీలకు 90 శాతం, జనరల్​ విభాగంలో 80 శాతం సబ్సిడీ డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందిస్తోంది. అయితే సబ్సిడీ ఎంత శాతం ఇచ్చినా జీఎస్టీ మాత్రం ప్రతి రైతు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో 18 శాతం జీఎస్టీ ఉండగా ప్రస్తుతం అది 5 శాతానికి తగ్గింది.
 
కూరగాయల తోటలకే 60 శాతం

2017–-18 వరకూ డ్రిప్​ఇరిగేషన్‌కు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫండ్స్​రిలీజ్ చేసేది. ఆయిల్​పామ్​సాగు పెంపు విషయంలో ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది.  దీంతో పండ్ల తోటలు, కూరగాయల తోటలకు సబ్సిడీతో అందించే డ్రిప్​కు ఫండ్స్​కొంతమేర తగ్గింది. అయితే ఈ ఫండ్స్ లో 20 శాతం పండ్ల తోటలు, 20 శాతం పత్తి, కంది వంటి పంటలకు డ్రిప్​సమకూర్చుకునే రైతులకు అందిస్తారు. మిగిలిన 60 శాతం ఫండ్స్​తో కూరగాయలు సాగు చేసే రైతులకు డ్రిప్​ అందిస్తారు. అయితే12.50 ఎకరాల లోపు తోటలు సాగు చేసే రైతులకు ఈ సబ్సిడీ వర్తించనుంది. 

కొత్తగా 1116 ఎకరాల్లో డ్రిప్​

2025–-26 ఫైనాన్స్ ఇయర్‌‌లో మూడు దశల్లో రూ. 3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 80, 90 శాతం సబ్సిడీతో 365 మంది  రైతులు కొత్తగా 1116 ఎకరాల్లో డ్రిప్​ఇరిగేషన్​ ఇన్​స్టాలేషన్​ చేశారు. ఇందుకోసం రూ. 2.91 కోట్లు రిలీజ్​ అయింది. ప్రస్తుతం వంద శాతం సబ్సిడీ పొందే ఎస్సీ, ఎస్టీ రైతులకు సంబంధించిన ప్రాసెస్​ నడుస్తోంది. 

జిల్లాలో 26 వేల ఎకరాల్లో సాగు

జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో భూమి సాగుకు యోగ్యంగా ఉంది. ఇందులో 4 లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తి, కంది సహా ఇతర పంటలు సాగు చేస్తున్నారు. తోటలు, కూరగాయలు 26 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో 12 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు సాగు చేస్తుండగా నిమ్మ తోటలు మరో 3 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 5 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్​, మరో 9 వేల ఎకరాల్లో ఇతర పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. కూరగాయలు మాత్రం 1500 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తంగా 4,63,602 ఎకరాల్లో 2.53 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తున్నారు.