మెక్సికోలో మరోసారి కాల్పుల కలకలం.. 12 మంది మృతి.. 20 మందికి గాయాలు

మెక్సికోలో మరోసారి కాల్పుల కలకలం.. 12 మంది మృతి.. 20 మందికి గాయాలు

మెక్సికో సిటీ: కాల్పుల మోతతో మెక్సికో మరోసారి దద్దరిల్లింది. తాజాగా గ్వానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటో నగరంలో బుధవారం (జూన్ 25) రాత్రి ఓ పార్టీలో దుండగులు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. దుండగుల కాల్పుల్లో 12 మంది మృతి చెందగా.. దాదాపు 20 మంది వరకు గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ గౌరవార్థం స్థానికులు వేడుకలు చేసుకుంటుండగా ఈ దాడి జరిగిందని తెలిపారు. 

ఇరాపువాటో అధికారి రోడాల్ఫో గ్మెజ్ సెర్వంటెస్ మీడియాతో మాట్లాడుతూ.. మృతుల సంఖ్య 12కి పెరిగిందని, దాదాపు 20 మంది గాయపడ్డారని ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కాల్పులకు తెగబడిన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. 

సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ గౌరవార్థం జరిగిన వేడుకల్లో దాడి జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపు దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈ దాడికి ముందు బాధితులు బ్యాండ్ వాయిస్తూ ఆనందంగా డ్యాన్స్ చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. కొందరు మద్యం సేవిస్తూ డ్యా్న్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తోండగా ఒక్కసారిగా దుండగులు కాల్పులు జరిపారు. అప్పటి వరకు ఎంతో ఆనందభరితంగా ఉన్న ఆ ప్రదేశం నిమిషాల వ్యవధిలోనే శ్మశానంలా మారిపోయింది.