కరెంట్ షాక్ తో పులి మృతి.. వండుకు తిన్న జనం..!

కరెంట్ షాక్ తో పులి మృతి.. వండుకు తిన్న జనం..!

విద్యుత్ కంచెకు తగిలి చనిపోయిన పులిని కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆడపులి పాదముద్రలను గుర్తించారు. దీంతో పులి ఆచూకీని తెలుసుకునేందుకు అదే రోజు ట్రాప్ కెమెరాలు అమర్చారు. పులి సంచారం గురించి సమీప ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఆరుబయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. 

అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన కంచె తగిలి పులి చనిపోయింది. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు పులి మాంసాన్ని వండుకుని తినేసినట్టు తెలుస్తోంది. అయితే పులి గోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య విబేధాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది పులి మాంసం తిన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.  మూడు రోజుల క్రితం నిందితుల్లో ఇద్దరిని ఎర్రగొండపాలెం ఆఫీసుకు పిలిచి రహస్యంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తల్లి కోసం రెండు పులి కూనలు వెతుకుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి.