- ఏపీకి రూ.13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు
- మొత్తం 340 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్
- ఆరు లక్షల జాబ్స్ వచ్చే చాన్స్
- విశాఖ నుంచే పాలన ఉంటుందన్న సీఎం జగన్
విశాఖపట్నం: పలు కంపెనీల నుంచి తమ రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. విశాఖపట్నంలో శుక్రవారం మొదలైన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఆయన మాట్లాడారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఆరు లక్షల జాబ్స్ వస్తాయని తెలిపారు. మరికొన్ని ఒప్పందాలు శనివారం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారుతుందని, ఇక్కడి నుంచే పాలన సాగిస్తామని జగన్ స్పష్టం చేశారు. ‘‘మాకు మొత్తం 340 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ రావడం గర్వకారణం. దాదాపు 20 సెక్టార్ల నుంచి పెట్టుబడులు వచ్చాయి. ఏపీ అన్ని రంగాల్లో ముందుకు సాగుతోంది. సహజ వనరులకు కొరత లేదు. భారీ తీరప్రాంతం ఉంది. ఆరు పోర్టులు, ఆరు ఎయిర్పోర్టులు, మూడు ఇండస్ట్రియల్ కారిడార్లను కంపెనీలు వాడుకోవచ్చు”అని సీఎం పేర్కొన్నారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా 92 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి.
పెట్టుబడుల వివరాలు ఇవి...
ఆంధ్రప్రదేశ్లో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు. రిలయన్స్ కేజీడీ6 లో రూ.1.50 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేసిందని అన్నారు. తమ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో రెండు కొత్త సిమెంట్ తయారీ ప్లాంట్లు, 15వేల మెగావాట్ల రెన్యువబుల్ఎనర్జీ ప్రాజెక్టులు, డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుందని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ సీఈవో కరణ్ అదానీ ఈ సందర్భంగా తెలిపారు. కడప, నడికుడిలో సిమెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో 400 మెగావాట్ల డేటా సెంటర్ను నిర్మిస్తామని వివరించారు. ఎన్టీపీసీ రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడితో 77వేల మందికి ఉపాధి కల్పించే మూడు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. స్టీల్ కంపెనీ జేఎస్డబ్ల్యూ గ్రూప్ 9,500 మందికి ఉపాధి కల్పించే రూ. 50,632 కోట్ల పెట్టుబడితో కూడిన ఆరు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. అరబిందో గ్రూప్ రూ.10,365 కోట్ల పెట్టుబడికి ఐదు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని నిర్మించడానికి రూ. 10వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.
పోర్టులను హైవేలతో కనెక్ట్ చేస్తాం : మంత్రి గడ్కరీ
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఓడరేవులను నాలుగు లేన్ల హైవేలతో లింక్ చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. మైనర్, మేజర్ పోర్ట్, ప్రైవేట్ లేదా స్టేట్ పోర్ట్ అనే తేడా లేకుండా అన్ని రకాల పోర్టులకు కనెక్టివిటీని మెరుగుపరిచే రోడ్లను నిర్మిస్తామని ప్రకటించారు. విశాఖపట్నం-–చెన్నై, చెన్నై–-బెంగళూరు, హైదరాబాద్-–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు ఏపీ మీదుగా వెళ్తాయని చెప్పారు. నాగ్పూర్, విజయవాడలను కలుపుతూ 430 కిలోమీటర్ల ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తామన్నారు.