ఢిల్లీకి చేరిన  ఫ్లాష్ సర్వే రిపోర్ట్

ఢిల్లీకి చేరిన  ఫ్లాష్ సర్వే రిపోర్ట్

 

  •  ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సీఈసీ భేటీ

  •  ఆశావహుల్లో  కొనసాగుతున్న టెన్షన్

  •  హస్తినలో ఆస్పిరేంట్స్.. టికెట్ల కోసం పైరవీలు

  • బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వాళ్లకు టికెట్లు లేనట్టే?


హైదరాబాద్: కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు టీం నిర్వహించిన ఫ్లాష్​ సర్వే రిపోర్ట్ ఢిల్లీకి చేరింది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ సర్వే  నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పలువురు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. టికెట్ల కోసం ఏఐసీసీలోని తమ చానళ్ల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  

11 స్థానాలకు అభ్యర్థులను మొదటి జాబితాలోనే ప్రకటించాలని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం చివరి క్షణంలో వాటిని నాలుగింటికే పరిమితం చేసింది. మిగతా ఏడు సెగ్మెంట్లను పెండింగ్ లో పెట్టింది. ఇందులో బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన వారి స్థానాలు  నాలుగు ఉండటం, వారికి టికెట్ కేటాయించొద్దని సీనియర్ల పట్టుబట్టడంతో ఏఐసీసీ రంగంలోకి దిగింది. మరో మారు ఫ్లాష్  సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు టీం మొత్తం 13 సెగ్మెంట్లలో ఫ్లాష్ సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల  నష్టం జరుగుతుందని రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన బొంతు రామ్మోహన్(సికింద్రాబాద్), పట్నం సునీతా మహేందర్ రెడ్డి(చేవెళ్ల), చంద్రశేఖర్ రెడ్డి( మల్కాజ్ గిరి), నీలం మధు(మెదక్)కు టికెట్లు రావడం అనుమానమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఎవరెవరిని అభ్యర్థులుగా ఫైనల్ చేస్తుంది.. ఏయే స్థానాలను పెండింగ్ లో పెడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.