మంచిర్యాల బల్దియాలో కాంగ్రెస్​ పైచేయి .. తాజాగా హస్తం గూటికి  15 మంది  కౌన్సిలర్లు

మంచిర్యాల బల్దియాలో కాంగ్రెస్​ పైచేయి .. తాజాగా హస్తం గూటికి  15 మంది  కౌన్సిలర్లు
  • 26కు పెరిగిన కాంగ్రెస్​ సంఖ్యాబలం  
  • త్వరలోనే అవిశ్వాసానికి రంగం సిద్ధం 

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు షాక్​ తగిలింది. ఆ పార్టీకి చెందిన15 మంది కౌన్సిలర్లు విడతల వారీగా హస్తం గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. మరికొందరు సైతం కారు దిగేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్​ అభ్యర్థి ప్రేమ్​సాగర్​రావు గెలవడం, రాష్ర్టంలో  కొత్త సర్కారు కొలువుదీరడంతో వారం రోజుల్లోనే మంచిర్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. నస్పూర్, లక్సెట్టిపేట మున్సిపాలిటీలకు చెందిన పలువురు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్​ వైపు చూస్తున్నారు. త్వరలోనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి మూడు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 

పెరిగిన కాంగ్రెస్​ బలం

 మంచిర్యాల మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్​ 22, కాంగ్రెస్​14 సీట్లను గెల్చుకున్నాయి. ఆ తర్వాత  కాంగ్రెస్​కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్​లో చేరారు. తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విడతల వారీగా 15 మంది కారు దిగారు. మొత్తం 17 మంది కాంగ్రెస్​లో చేరడంతో ఆ పార్టీ బలం 26కు పెరిగింది. 36 సీట్లకు గాను మ్యాజిక్​ ఫిగర్​19. దీంతో త్వరలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 
అలాగే నస్పూర్​ మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులకు గాను కాంగ్రెస్​కు ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. రెండ్రోజుల కిందట ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు సమక్షంలో వైస్​చైర్మన్ శ్రీనివాస్​ కాంగ్రెస్ లో చేరారు.  మిగిలిన వారిలో మెజారిటీ సభ్యులు హస్తంలోకి జంప్​ కానున్నారని సమాచారం.  

కాంగ్రెస్​లో చేరిన కౌన్సిలర్లు

మంచిర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు చెందిన పలువురు కౌన్సిలర్లు గురువారం ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు సమక్షంలో హైదరాబాద్​లో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. వీరిలో ప్రకాశ్​నాయక్​(7వ వార్డు), బొలివెట్టి సునీత (9వ వార్డు), వంగపల్లి అనిత (19వ వార్డు), మెరుగు మహేశ్వరి (22వ వార్డు), మీనాజ్​ (25వ వార్డు), నాంపల్లి మాధవి (26వ వార్డు), సిరికొండ పద్మ (27వ వార్డు), మాదంశెట్టి సత్యనారాయణ (34వ వార్డు)తో పాటు బీఆర్​ఎస్​ నాయకులు ఖాజామియా, బోడ ధర్మేందర్​, తూముల ప్రభాకర్​ ఉన్నారు.  

కలెక్టర్​కు  అవిశ్వాసం నోటీసు అందజేత

మంచిర్యాల  మున్సిపల్​ చైర్మన్​ పెంట రాజయ్య, వైస్​ చైర్మన్​ గాజుల ముఖేశ్​గౌడ్​పై 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. శుక్రవారం కలెక్టర్​ బదావత్​ సంతోష్​ను కలిసి నోటీసును అందజేశారు. మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులకు  గాను బీఆర్​ఎస్​22, కాంగ్రెస్​ 14 సీట్లు గెల్చుకున్నాయి. ఆ తర్వాత  జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్​  బలం 26కు చేరింది. ప్రస్తుతం బీఆర్ఎస్​లో మిగిలిన 10 మందిలో కూడా పలువురు కాంగ్రెస్  వైపు చూస్తున్నారు.

మొత్తం 36 సీట్లకు గాను మ్యాజిక్​ ఫిగర్​ 19 కాగా, ఇంకా ఏడుగురు ఎక్కువే ఉన్నారు. దీంతో చైర్మన్​ పెంట రాజయ్య, వైస్​ చైర్మన్​ ముఖేశ్​గౌడ్​లపై అవిశ్వాసం తీర్మానం నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. చైర్మన్​గా కాంగ్రెస్​ పార్టీ ఫ్లోర్​ లీడర్​ రావుల ఉప్పలయ్యను, వైస్​ చైర్మన్​గా బీఆర్​ఎస్​ నుంచి వచ్చిన ఓ సీనియర్​ కౌన్సిలర్​ను ఎన్నుకునేందుకు మంతనాలు జరుగుతున్నట్టు తెలిసింది.  కలెక్టర్​కు నోటీసు అందజేసిన అనంతరం కౌన్సిలర్లు హైదరాబాద్​లో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు వద్దకు బస్సులో బయల్దేరారు.