హైదరాబాద్, వెలుగు: నేషనల్ సైన్స్ డేలో భాగంగా వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో అమ్మాయిలు సత్తా చాటారు. నాలుగు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో మొత్తంగా 20 మందిని విజేతలుగా ప్రకటిస్తే.. అందులో 15 మంది అమ్మాయిలే ఉండడం విశేషం. ఆ నాలుగు విభాగాల్లోనూ ఫస్ట్, సెకండ్ ప్రైజ్లను పొందిందీ అమ్మాయిలే. నేషనల్ సైన్స్ డేలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీఎస్ కాస్ట్), ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఈపీటీఆర్ఐ)లు కలిసి ఇటీవల స్కూల్ విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించారు. శనివారం విజేతలను ప్రకటించారు.
‘దేశీయ సాంకేతికతతో వికసిత్ భారత్’ అనే థీమ్తో నిర్వహిస్తున్న నేషనల్ సైన్స్ డేలో.. వ్యర్థాల తగ్గింపు, ఇ–వేస్ట్ తగ్గింపు, ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీరు, కరెంట్ ఆదా వంటి విషయాలపై నాలుగు విభాగాలుగా కాంపిటీషన్స్ పెట్టారు. ఆయా అంశాలపై పాటలు, కవిత్వం, పెయింటింగ్, వక్తృత్వ (ప్రసంగం) పోటీలను పెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 396 మంది పోటీలో పాల్గొనగా.. 20 మందిని విజేతలుగా ప్రకటించారు. ఒక్కో విభాగంలో ఐదుగురిని ఎంపిక చేశారు. వీరందరికీ ఈ నెల 28న వరంగల్లోని రీజనల్ సైన్స్ సెంటర్లో నిర్వహించే నేషనల్ సైన్స్ డే వేడుకల్లో బహుమతులను ప్రదానం చేస్తారు.
