
- 16,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- స్కూళ్లు, కాలేజీలు బంద్
- సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
పుణే: మహారాష్ట్రలోని పుణెను వానలు వణికిస్తున్నాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లతో నిండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన వివిధ ప్రమాదాల్లో 17 మంది చనిపోగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని 16,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న 500 మందిని కాపాడారు. స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ పాల్గొన్నారని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
- వర్షాలకు 17 మంది చనిపోయారు.
- 16000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- కేధ్ శివపుర్ గ్రామం దగ్గర్లో నేషనల్ హైవే ఉన్న దర్గాలో పడుకున్న ఐదుగురు కూలీలు వరద నీటిలో కొట్టుకుపోయారు.
- అర్నేష్వర్ ఏరియాలో గోడకూలిన ఘటనలో ఐదుగురు చనిపోయారు.
- చాలా ఏరియాల్లో ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ఇంటి గోడలు కూలిపోయాయి.
- ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు.
- సస్వాడ్ – నారాయణ్పూర్ రూట్లో రాకపోకలు బంద్ అయ్యాయి.
- వర్షానికి భారీ చెట్లు కూలి వాహనాలపై పడటంతో ఆటోలు, బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
- కార్లు, బైకులు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
డెంగీ ఫీవర్తోనూ వరదలపై ఎంపీ సుప్రియా సూలే రివ్యూ
ముంబై: బారామతి ఎంపీ, శరద్పవార్ కూతురు సుప్రియా సూలేకు డెంగీ అటాక్ అయింది. ఆమె స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. “నాకు డెంగీ వచ్చింది. డాక్టర్లు బెడ్రెస్ట్ తీసుకోమని చెప్పారు. మా టీం వరద ప్రాంతాల్లో సహాయకచర్యల్లో పాల్గొన్నారు. నేను అధికారులతో కాంటాక్ట్లో ఉన్నాను” అని సుప్రియా ట్వీట్ చేశారు.