- ఆపరేషన్ సిందూర్ వేళ జమ్మూలోని ఉరిలో సీఐఎస్ఎఫ్వీరోచిత పోరాటం
- 19 మంది సిబ్బందికి డైరెక్టర్ జనరల్స్డిస్క్ లతో సత్కారం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ టైమ్లో పాకిస్తాన్ దుశ్చర్యను దీటుగా ఎదుర్కొని.. 250 మంది ప్రాణాలను కాపాడారు మన సీఐఎస్ఎఫ్ సిబ్బంది. ఒకవైపు నింగిలోంచి దూసుకొస్తున్న పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూలుస్తూనే.. ఆ పరిసరాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శత్రువుకు ఎదురొడ్డి.. అక్కడి ఆస్తులనూ రక్షించారు. వీరోచితంగా పోరాడిన 19 మంది సీఐఎస్ఎఫ్ వీరులు ప్రతిష్టాత్మకమైన ‘డైరెక్టర్ జనరల్స్ డిస్క్’లను అందుకున్నారు. ఆ పురస్కారాల ప్రదానంతో నాటి పోరాటం వెలుగులోకి వచ్చింది.
ఆ రోజు ఏం జరిగింది?
మే 7న భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ప్రతిగా పాకిస్తాన్ మన భూభాగంపైకి డ్రోన్లతో అటాక్ చేసింది. ఎల్వోసీకి 10 కిలోమీటర్ల దూరంలోని ఉరి ప్రాంతంపై భారీగా డ్రోన్లను ప్రయోగించింది. ఈ ఏరియాలో ఎన్హెచ్పీసీ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది తమ కుటుంబాలతో స్థానికంగా నివసిస్తుంటారు.
పాక్ డ్రోన్లతో దాడిని మొదలుపెట్టగానే.. ప్లాంట్ల పరిసరాల్లో డ్యూటీలో ఉన్న కమాండెంట్ రవి యాదవ్ ఆధ్వర్యంలోని 19 మందితో కూడిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) టీమ్ అలర్ట్ అయింది. డ్రోన్లను కూల్చేస్తూనే ఎన్హెచ్పీసీ స్టాఫ్తోపాటు స్థానికులను 250 మందిని బంకర్లలోకి తరలించింది. ఇట్ల 250మంది ప్రాణాలను కాపాడటంతోపాటు పవర్ ప్లాంట్లకు ఎలాంటి డ్యామేజీ కాకుండా సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎదురొడ్డి పోరాడారు.
వీరిని ‘డైరెక్టర్ జనరల్స్ డిస్క్’లతో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్సత్కరించారు. డిస్క్లు అందుకున్నవారిలో కమాండెంట్రవి యాదవ్, డిప్యూటీ కమాండెంట్ మనోహర్సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ సుభాష్కుమార్, ఇన్స్పెక్టర్ డీపక్ కుమార్ ఝా, సబ్ ఇన్స్పెక్టర్లు అనిల్కుమార్, దీపక్ కుమార్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు రాజీవ్ కుమార్, సుఖ్దేవ్సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు మనోజ్ కుమార్ శర్మ, రామ్ లాల్, గుర్జిత్ సింగ్, కానిస్టేబుల్ సుశీల్ వి కాంబ్లే, రజాక్ రఫీక్, రవీంద్ర వాంకడే, త్రిదేవ్ చక్మా, సోహాన్ లాల్, ముఫీద్ అహ్మద్, మహేశ్కుమార్, సందెనబోయిన రాజు ఉన్నారు.
