బరువు ఎక్కువైందని విమానం నుంచి దించేశారు

బరువు ఎక్కువైందని విమానం నుంచి దించేశారు

న్యూఢిల్లీ: బరువెక్కువైందని 19 మంది ప్రయాణికులను అర్ధంతరంగా దించేశారు.. ఏ బస్సులో నుంచో, ట్రక్క్‌‌లో నుంచో కాదు ఏకంగా విమానం నుంచి. బ్రిటిష్ ఎయిర్‌‌‌‌లైన్‌‌ కంపెనీ ఈజీజెట్‌‌  బరువు ఎక్కువగా ఉండడంతో ఎగరలేకపోయిందని, దీంతో 19 ప్రయాణికులను దించేయాల్సి వచ్చిందని డైలీ మెయిల్‌‌ పేర్కొంది.  డజన్ కంటే ఎక్కువ మంది   స్పెయిన్‌‌ నుంచి బ్రిటన్‌‌కు ట్రావెల్‌‌ చేయడానికి ఈ విమానం ఎక్కారని తెలిపింది. వాతావరణం బాగోలేకపోవడం వలన, విమానం బరువు ఎక్కువవ్వడం వలన  ఈ ఫ్లయిట్‌‌ షెడ్యూల్డ్ టైమ్‌‌ రాత్రి 9.45 కంటే  రెండు గంటలు ఆలస్యంగా ఈ నెల ఐదున  టేకాఫ్ అయ్యిందని రిపోర్ట్ చేసింది.

ఈ సంఘటనకు  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టేకాఫ్ అవ్వడానికి ఆలస్యం అవుతుందని ఈ విమానం పైలెట్‌‌ ప్యాసెంజర్లకు చెప్పడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.  ఎక్కువ మంది ఉండడం వలన విమానం బాగా బరువుగా మారిందని,  దీనికితోడు రన్‌‌వే తక్కువగా ఉండడం, వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడం వలన టేకాఫ్ చేయడం కష్టంగా ఉందని పైలెట్‌ పేర్కొన్నడాన్ని చూడొచ్చు. విమానం టేకాఫ్ కావాలంటే బరువు తగ్గాలని, వాలంటరీగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్న 20 మంది ప్రయాణికులు ముందుకు రావాలని ఆయన కోరారు.  వాలంటరీగా దిగిపోయే వారికి500 పౌండ్ల వరకు ఈజీజెట్‌‌ ఇన్సెంటివ్‌‌ ఇస్తుందని ప్రకటించారు.  చాలా మంది  ఈ ఆఫర్‌‌‌‌కు ఆకర్షితులు కాలేదని తెలుస్తోంది. ‘నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’ అని ఓ ప్యాసెంజర్ అరవడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. క్రూ మెంబర్లు చివరికి 19 మందిని గుర్తించగలిగారు.