- వెంచర్క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీల నుంచి ఏకంగా 36 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- 2020తో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువ
- టెక్ కంపెనీల ఐపీఓలు ఉత్సాహం నింపాయ్
- వచ్చే ఏడాదిలోనూ జోరు కంటిన్యూ
2021 మన స్టార్టప్లకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది మును పెన్నడూ లేనంతగా పెట్టుబడులు మన దేశంలోని స్టార్టప్లకు దొరికాయి. అంతేకాదు కొత్త రికార్డులు నెలకొల్పాయి. మన దేశంలోని ప్రైవేటు కంపెనీలు (స్టార్టప్లు) ఏకంగా 36 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెచ్చుకున్నాయి. డిజిటైజేషన్ ఊపందుకోవడంతో పెట్టుబడులు బాగా పెరిగినట్లు యూకే ఇన్వెస్ట్మెంట్ డేటా ప్లాట్ఫామ్ ప్రెకిన్ అంచనా వేస్తోంది. గత ఏడాది కాలంగా స్టార్టప్లలో వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగినట్లు ఆ కంపెనీ డేటా వెల్లడిస్తోంది. అంతకు ముందు ఏడాది అంటే 2020లో ఇలా వచ్చిన పెట్టుబడులు 11 బిలియన్ డాలర్లే.
హైదరాబాద్, వెలుగు: 2021లో సీడ్ స్టేజ్లో ఉన్న స్టార్టప్లలోనే ఎక్కువ డీల్స్ జరిగాయి. ఈ సెగ్మెంట్లో ఏకంగా 705.86 మిలియన్ డాలర్ల విలువైన 396 డీల్స్ జరిగాయి. ఇక సిరీస్ ఏ ఫండింగ్ చూస్తే 166 డీల్స్లో 1.67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువ మొత్తంలో ఫండ్స్ను మాత్రం ప్రీ ఐపీఓ రౌండ్స్లోని కంపెనీలే చేజిక్కించుకున్నాయి. జొమాటో, ఓలా, పాలసీబజార్, పేటీఎం వంటి 10 డీల్స్లో దేశంలోకి 5.58 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రెకిన్ డేటా చెబుతోంది. గత ఏడాది కాలంగా డీల్స్ పెరగడమే కాకుండా, మన స్టార్టప్ కంపెనీలు డబ్బు సేకరణ కోసం ఎక్కువ రౌండ్స్ కూడా చేయగలిగాయి. రిస్క్ ఎక్కువగా తీసుకోవాలనే ఆలోచన పెరగడం వల్ల మన స్టార్టప్లలో విదేశీ వెంచర్ క్యాపిటల్ కంపెనీలు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలూ ఎక్కువ పెట్టుబడులను పెట్టాయి. స్టార్టప్స్ వాల్యుయేషన్స్ కూడా అలాగే జోరందుకున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి వాల్యూ వస్తోందనే అంచనాలు పెరగడం వల్లే ఈ ఏడాది మన స్టార్టప్స్వాల్యుయేషన్ పెరిగింది. జొమాటో, నైకా, పాలసీబజార్ వంటివి ఐపీఓలకి రావడంతో గతంలోని ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వచ్చాయి. దీంతో వాల్యుయేషన్స్ ఊపందుకున్నాయని స్టెలారిస్ వెంచర్ పార్ట్నర్స్ ఫౌండర్ అలోక్ గోయల్ చెప్పారు. బుల్, బేర్ సైకిల్స్లో సాధారణంగానే మార్కెట్లు కొంత ఎక్కువగా రియాక్ట్ అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మనం బుల్ సైకిల్ రియాక్షన్ చూస్తున్నామని, భవిష్యత్లో బేరిష్ కరెక్షన్ వచ్చినా ఆశ్చర్యపోనని అన్నారు. 2021లోని జోరు కొనసాగకపోవచ్చని అలోక్ గోయల్ చెప్పారు.
టైగర్ గ్లోబల్, ఫాల్కన్ ఎడ్జ్, సెకోవియా క్యాపిటల్, యాక్సెల్, బ్లూమ్ వెంచ్స్ వంటి పెద్ద ఇన్వెస్టర్లు ఈ ఏడాది మన మార్కెట్లో చురుగ్గా ఉన్నారు. పెద్ద పెట్టుబడులు పెడుతుందనే పేరున్న సాఫ్ట్ బ్యాంక్ 2021లో మన స్టార్టప్లలో 3 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. ఒక ఏడాదిలో ఈ కంపెనీ మన దేశంలో ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మన దేశంలోని యూనికార్న్ల సంఖ్య కూడా డజన్ల కొద్దీ పెరిగింది. బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దాటితే ఆ స్టార్టప్లను యూనికార్న్గా చెబుతారు. మన దేశం నుంచి ఏకంగా 40 కంపెనీలు యూనికార్న్ క్లబ్లో చేరాయి. ఏప్రిల్ నెలలో నాలుగు రోజుల తేడాలో ఆరు కంపెనీలు ఈ క్లబ్లో చేరడం విశేషం. ఈ యూనికార్న్లే కాకుండా, హైగ్రోత్ స్టేజ్లో ఉన్న చాలా కంపెనీలూ ఈ ఏడాది చాలా రౌండ్లలో డబ్బులు భారీగా సమీకరించాయి. ఫిన్టెక్ స్టార్టప్ క్రెడ్, ఆఫ్బిజినెస్, గ్రో, కార్స్24, లిషియస్, స్పిన్నీ, ఇన్ఫ్రా.మార్కెట్, గుడ్ గ్లామ్ గ్రూప్, ప్రిస్టిన్ కేర్ వంటి స్టార్టప్ల వాల్యుయేషన్స్ గత ఏడాది కాలంగా భారీగా పెరిగాయి.
మన మార్కెట్ల డెప్త్ పెరగడంతో మెరుగైన ఫౌండింగ్ టీమ్స్ స్టార్టప్స్తో ముందుకొస్తున్నాయని, ఐపీఓల ద్వారా ఎగ్జిట్ కూడా బాగుండటంతో 2021 మన కంపెనీలకు బాగా కలిసొచ్చిందని లైట్స్పీడ్ ఇండియా పార్ట్నర్ వైభవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ఏడాది యూనికార్న్లుగా మారిన షేర్ చాట్, అప్నా కో వంటి స్టార్టప్లలో లైట్స్పీడ్ పెట్టుబడులు పెట్టింది. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు డబ్బు సమీకరించి పెట్టుకుంటే, ఆ తర్వాత దీనిని వాడుకోవచ్చని యూనికార్న్ ఫౌండర్లు ఆలోచించారు.
స్ట్రాటజీల అమలులో బిజీ
కావల్సినంత డబ్బు వచ్చి పడటంతో తమ బిజినెస్ స్ట్రాటజీలు అమలు చేసి, మార్కెట్లో దూసుకెళ్లే బిజీలో ఉన్నాయి స్టార్టప్ కంపెనీలు. విదేశాలకు సైతం విస్తరించే ప్రయత్నాలలో మునిగిపోయాయి. క్రిప్టో, సాస్, డైరెక్ట్ టూ కన్జూమర్, ఫిన్టెక్, బిజినెస్ టూ బిజినెస్, ఎడ్టెక్, హెల్త్కేర్ వంటి సెక్టార్లు 2021లో ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాదిలో కూడా ఈ సెక్టార్ల జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాలెన్స్ షీట్లను పటిష్టం చేసుకుని, మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినా తట్టుకోవడానికి ముందుగానే ఫండ్స్ సేకరించి మన స్టార్టప్ ల ఫౌండర్లు రెడీ అవుతున్నారని 3వన్4 కాపిటల్ కో ఫౌండర్ ప్రణవ్ పాయ్ చెప్పారు. కొన్నేళ్ల కిందట స్టార్టప్ ఎంట్రప్రెనూర్లు ఐపీఓల గురించి మాట్లాడితే, పెద్దగా ఇన్వెస్టర్లకు ఎక్కేది కాదు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. చాలా టెక్నాలజీ కంపెనీలు ఐపీఓలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాయి. నజారా వంటి చిన్న గేమింగ్ స్టార్టప్ కూడా ఈ ఏడాది ఐపీఓ పూర్తి చేయగలగడంతోపాటు, జొమాటో ఐపీఓకి ఆదరణ దొరకడంతో కనీసం ఆరు టాప్ లీగ్ స్టార్టప్లు ఐపీఓలకి రావడానికి స్టేజ్ సెట్ అయ్యింది. దీంతో చాలా స్టార్టప్ల ఫౌండర్లు 2022 లేదా 2023లో ఐపీఓలకి రావాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. పాలసీబజార్, నైకా, పేటీఎం వంటి కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా 2.5 బిలియన్ డాలర్లను సమీకరించాయి. వచ్చే ఏడాదిలోనూ స్టార్టప్ల ఐపీఓ జోరు కొనసాగుతుందనే ఆశాభావాన్ని లైట్ స్పీడ్పార్ట్నర్ అగర్వాల్ వ్యక్తం చేస్తున్నారు.