
వాషింగ్టన్: 2022 అత్యంత వేడి సంవత్సరాల్లో ఐదోదిగా రికార్డులకెక్కింది. 2022లో భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు 1.6 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన గోడార్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ (జీఐఎస్ఎస్) తెలిపింది. 2015లో కూడా 1.62 డిగ్రీల ఎక్కువ టెంపరేచర్ రికార్డయిందని జీఐఎస్ఎస్ వెల్లడించింది. ‘‘గ్రీన్ హౌస్ గ్యాసెస్ను వాతావరణంలోకి విచ్చలవిడిగా విడుదల చేస్తున్నం. అందువల్లే భూమి వేడెక్కుతోంది. రాబోయే రోజులు మరింత కఠినంగా ఉంటయ్” అని జీఐఎస్ఎస్ డైరెక్టర్ గవిన్ షెమిడ్ హెచ్చరించారు. అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ 2022 వార్షిక సమావేశంలో జీఐఎస్ఎస్ రిసర్చ్ కు సంబంధించిన అంశాలను ఆయన వెల్లడించారు. 1880 తర్వాత గత తొమ్మిదేండ్లు (2014 నుంచి 2022 వరకు) అత్యంత వేడి సంవత్సరాలుగా రికార్డయ్యాయని ఆయన చెప్పారు. 19వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే 2022లో టెంపరేచర్ .. రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదైందని పేర్కొన్నారు.