
- ఖమ్మం జిల్లాలో 8, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 14 గ్రామాల మధ్య పోటీ
- 5 వేల జనాభా మించి ఉన్న ఊర్లకు అవకాశం
- ఈ ఏడాది అక్టోబర్ మొదటివారం వరకు గడువు
- ఎంపికైన గ్రామానికి రూ.కోటి కేంద్ర ప్రభుత్వ నిధులు
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్ ఎంపిక కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేసేందుకు గాను అర్హత ఉన్న గ్రామాలను ఇప్పటికే ఆఫీసర్లు గుర్తించారు. 5 వేల జనాభాకు మించి ఉన్న రెవెన్యూ గ్రామాలకు మాత్రమే అవకాశం ఉండడంతో, ఖమ్మం జిల్లాలో 8 రెవెన్యూ గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 గ్రామాలు ప్రస్తుతం పోటీపడుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ గ్రామాలకు గాను ఏ గ్రామంలో అయితే ఎక్కువ మంది ఇండ్లపై సొంతంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని ఉంటారో, ఆ గ్రామాన్ని ఎంపిక చేస్తారు.
జిల్లాకొకటి చొప్పున మోడల్ సోలార్ విలేజ్ గా ఎంపిక చేసి, కేంద్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తుంది. ఈ రూ.కోటి నిధులతో ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయం, వ్యవసాయ బోర్లు, ప్రభుత్వాస్పత్రి, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ ఆఫీస్ లాంటి ప్రభుత్వ భవనాలకు సోలార్ విద్యుత్ బిగించుకోవాల్సి ఉంటుంది. ఆయా గ్రామ పంచాయతీలపై ఆర్థిక భారం లేకుండా అన్ని ప్రభుత్వాఫీసుల్లో సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా, ఆ జీపీకి వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
మేజర్ ఖర్చులో కరెంటు బిల్లు ఒకటి...
గ్రామ పంచాయతీకి ఉండే మేజర్ ఖర్చులో కరెంటు బిల్లు కూడా ఒకటి. స్ట్రీట్ లైట్స్ సహా ప్రభుత్వ భవనాలకు ఉపయోగించే కరెంటు బిల్లును పంచాయతీ ఆదాయం నుంచే ఖర్చు చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కింద రూ.కోటి ప్రోత్సాహకానికి ఎంపికైతే ఉచితంగా కరెంటు వాడుకునే అవకాశం కలుగుతుంది. ఆ మిగులు నిధులను రోడ్లు, లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రధానమంత్రి సూర్యఘర్ కింద గ్రామాల్లో సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటును ప్రోత్సహించనున్నారు.
ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం తర్వాత ఎంపిక చేసిన గ్రామాల మధ్య పోటీ ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం నాటికి ఏ గ్రామంలో ప్రజలు స్వయంగా ఎక్కువ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే, ఆ గ్రామాన్నే స్కీమ్ అమలు కోసం ఎంపిక చేస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంటు స్కీమ్ తో గ్రామాల్లో దాదాపు 70 శాతం మంది అర్హులుగా ఎంపికయ్యారు. సర్పంచ్, పాలకవర్గాలు లేకపోవడంతో మిగిలిన వారిలో ఇండ్లపై సొంతంగా సోలార్ ప్లాంట్లు బిగించుకునేందుకు గ్రామస్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శులపై పడింది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా..
కేంద్ర ప్రభుత్వ పథకం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడల్ సోలార్ విలేజ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద ఖమ్మం జిల్లా బోనకల్ మండలాన్ని పూర్తిగా ఎంపిక చేయగా, పాలేరు నియోజకవర్గంలో చెరువుమాదారం, వైరా నియోజకవర్గంలోని శ్రీరామగిరి, మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాలను ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి ఇండ్లు, వ్యవసాయానికి ఉచిత సోలార్ విద్యుత్ అందించనున్నారు. ఈ స్కీమ్ కింద ఖమ్మం జిల్లాలో 20 వేల కుటుంబాలకు లబ్ధి జరగనుంది.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోటీపడుతున్న గ్రామాలివే..!
గ్రామం మండలం
అశ్వాపురం అశ్వాపురం
భద్రాచలం భద్రాచలం
సారపాక బూర్గంపాడు
బూర్గంపాడు బూర్గంపాడు
నాగినేనిప్రోలు బూర్గంపాడు
చంద్రుగొండ చంద్రుగొండ
రుద్రంపూర్ చుంచుపల్లి
బాబుక్యాంప్ చుంచుపల్లి
దమ్మపేట దమ్మపేట
మందలపల్లి దమ్మపేట
కూనవరం మణుగూరు
సమితిసింగారం మణుగూరు
సుజాతనగర్ సుజాతనగర్
చర్ల చర్ల
ఖమ్మం జిల్లాలో పోటీపడుతున్న గ్రామాలివే!
గ్రామం మండలం అన్నారుగూడెం తల్లాడ
తనికెళ్ల కొణిజర్ల
నేలకొండపల్లి నేలకొండపల్లి
తల్లాడ తల్లాడ
కొణిజెర్ల కొణిజెర్ల
ముదిగొండ ముదిగొండ
వల్లభి ముదిగొండ
కందుకూరు వేంసూరు